శిక్షణార్థులకు భోజన, వసతి ఏర్పాట్లు.. యువతకు భరోసా కేంద్రాలుగా స్టడీ సర్కిళ్లు
రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలల అప్గ్రేడ్.. అన్ని గురుకులాల్లో ఇంటర్మీడియట్ విద్యజిల్లాకో బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల.. ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయం
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రతి జిల్లాలో ఒకో వర్గానికి ఒకటి చొప్పున 33 జిల్లాల్లో 132 స్టడీ సరిళ్లను ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్టడీ సరిళ్లు.. కేవలం పోటీ పరీక్షలకు సిద్ధంచేసే శిక్షణ కేంద్రాలుగానే కాకుండా, యువతకు ఉద్యోగ, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చెందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల వివరాలు అందించేలా, చదువుకు తగ్గ ఉపాధి సమాచారాన్ని, గైడెన్స్ను అందించే కేంద్రాలుగా స్టడీ సరిళ్లను తీర్చిదిద్దాలని చెప్పారు. పదో తరగతి వరకు విద్యనందిస్తున్న రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను కూడా ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
ఈ విద్యా సంవత్సరం నుంచే ఇందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్టడీ సర్కిళ్లు, గురుకుల పాఠశాలల ఉన్నతీకరణ, బలహీనవర్గాలకు ఉపాధి సంబంధిత అంశాలపై ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలకు ఉద్యోగ ఉపాధి రంగాల్లో విజయావకాశాలను సాధించిపెట్టే అస్త్రాలుగా రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న స్టడీ సరిళ్లు రూపాంతరం చెందాలి. శిక్షణనిచ్చే క్యాంపస్ రిక్రూట్మెంట్ కేంద్రాలుగా మారాలి. ఎంప్లాయ్మెంట్ అవెన్యూలుగా స్టడీ సరిళ్లను తీర్చిదిద్దాలి. కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో, దేశవ్యాప్తంగా ప్రకటించే ఉద్యోగాలను అందిపుచ్చుకొనే విధంగా యువతను తీర్చిదిద్దాలి. ఒక ప్రతిభావంతమైన స్టడీ సరిల్ ఎలా ఉండాలో విధివిధానాలను అధికారులు రూపొందించాలి.
ఇందుకు సమర్థులైన అధికారులను నియమించాలి. ఐటీఐ, పాలిటెక్నిక్, ఫార్మా, కెమికల్, ఇండస్ట్రీ, డిఫెన్స్, రైల్వే, బ్యాంకింగ్, నర్సింగ్, అగ్రికల్చర్ తదితర కోర్సులనుపూర్తిచేసుకున్న తెలంగాణ యువతీ యువకులకు దేశవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధిని కల్పించే అద్భుతమైన భూమికను స్టడీ సరిళ్లు పోషించాలి. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు అనే కోణంలోనే కాకుండా ప్రైవేట్ రంగాలలో కూడా ఉపాధిని అందించగలిగే కేంద్రాలుగా మారాలి. శిక్షణ పొందుతున్న అర్హులైన అభ్యర్థులకు స్టడీ సరిళ్లలో భోజన వసతులు ఏర్పాటు చేయాలి. ప్రతి స్టడీ సరిల్లో కంప్యూటర్లు, అత్యాధునిక సాంకేతిక మౌలిక వసతులను కల్పించాలి. ఆయా జిల్లాల్లో ఆయా వర్గాల జనాభా నిష్పత్తిని అనుసరించి ప్రవేశాలు కల్పించే దిశగా విధివిధానాలు రూపొందించాలి. బాలురకు కల్పించినట్టుగానే బాలికలకు కూడా స్టడీ సరిళ్లల్లో ప్రత్యేక వసతిని ఏర్పాటు చేయాలి’ అని సీఎం చెప్పారు.
గురుకులాల్లో ఇంటర్మీడియట్ విద్య
విద్యార్థి దశలో కీలకమైన మలుపుగా భావించే ఇంటర్మీడియట్ విద్యకు కూడా ప్రభుత్వమే పునాది వేయాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందుకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సులను ప్రవేశపెట్టాలని ఆదేశించారు. బాలికలకు విద్యను అందిస్తున్న కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో కూడా ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టాలని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధ కనబరిచే ఉన్నతాధికారిని నియమించాలని అన్నారు. ప్రతి సంవత్సరం పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంతమంది? వారు ఆ తరువాత ఎంచుకుంటున్న మార్గాలు తదితర అంశాలపై సమగ్ర నివేదికను అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వినియోగించుకోవాలని సీఎం అన్నారు.
33 బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల ఏర్పాటు
రాష్ట్రంలో ప్రస్తుతమున్న గురుకుల డిగ్రీ కళాశాలలకు అదనంగా మరో 15 మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాబోయే విద్యా సంవత్సరంలో వీటిని 17కు పెంచి మిగతా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని చెప్పారు. మొత్తంగా జిల్లాకో డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాల చొప్పున 33 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సీఎస్ను ఆదేశించారు. బీసీల జనాభా అధికంగా ఉన్నదని, ఆ దామాషా ప్రకారం రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పెంచాలని చెప్పారు.
సంప్రదాయ కోర్సులను కాకుండా నేటి పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగావకాశాలను కల్పించే డిగ్రీ కోర్సులను రూపొందించాలని అన్నారు. ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి విధివిధానాలను రూపొందించాలని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, రోహిత్రెడ్డి, విద్యాసాగర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, సీఎంవో ముఖ్యకార్యదర్శి ఎస్ నర్సింగ్రావు, సీఎం కార్యదర్శి భూపాల్రెడ్డి, బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎంవో కార్యదర్శి రాహుల్ బొజ్జా, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ఇతర అధికారులు రొనాల్డ్ రోస్, అహ్మద్ నదీమ్, బీ షఫియుల్లా, క్రిస్టినా జెడ్ చొంగ్తూ, మల్లయ్య భట్టు తదితరులు పాల్గొన్నారు.
సివిల్ సర్వీసెస్కూ స్టడీ సర్కిళ్లు
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, గ్రూప్-1 వంటి కేంద్ర, రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు శిక్షణనిచ్చేందుకు ‘ఆల్ ఇండియా సర్వీసెస్ స్టడీ సరిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్’ ను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కేంద్రంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు ఒక్కొక్కటి చొప్పున నాలుగు స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఐఎఫ్ఎస్ ర్యాంకర్ రాజుకు సీఎం కేసీఆర్ అభినందన
తొలి ప్రయత్నంలోనే ఐఎఫ్ఎస్ పరీక్షలు-2021లో ఆల్ ఇండియా 86వ ర్యాంక్ సాధించిన సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజీ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) విద్యా ర్థి కాసర్ల రాజును సీఎం కేసీఆర్ అభినందించారు. రాజు స్ఫూర్తితో కళాశాల నుంచి మరింత మంది విద్యార్థులు ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. మంగళవారం ప్రగతిభవన్లో రాజు మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్ను కలిశారు. 23 ఏండ్ల రాజుది జనగామ జిల్లా సూరా రం. గత ఏడాదే బీఎస్సీ ఫారెస్ట్రీ పూర్తి చేశాడు.
రాజు ప్రస్తుతం ఎఫ్సీఆర్ఐలో ఎమ్మెస్సీ ఫారెస్ట్రీని అభ్యసిస్తున్నాడు. ఎఫ్సీఆర్ఐ వంటి ప్రపం చస్థాయి సంస్థను స్థాపించి, తనలాంటి విద్యార్థులకు అటవీ విద్యను అభ్యసించడానికి, ఐఏఎస్/ఐఎఫ్ఎస్ వంటి అత్యుత్తమ పోటీ పరీక్షలను లక్ష్యంగా చేసుకొనేందుకు అవకాశం కల్పించినందుకు కేసీఆర్కు రాజు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఘనత సాధించిన రాజును ఎఫ్సీఆర్ఐ డీన్ ప్రియాంక వర్గీస్, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. ఐఎఫ్ఎస్ సాధనలో తనకు ప్రేరణనిచ్చి సహకరించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, డిప్యూటీ డైరెక్టర్ కే శ్రీనివాస్, డీసీఎఫ్ ఏ నరసింహారెడ్డి, అధ్యాపకులు, సిబ్బందికి రాజు ధన్యవాదాలు తెలిపారు.
కార్పొరేషన్ చైర్మన్లను అభినందించిన సీఎం
ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం, రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్పర్సన్ మంత్రి శ్రీదేవి, ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఖాజా ముజీబుద్దీన్ను సీఎం కేసీఆర్ అభినందించారు. బుధవారం ప్రగతిభవన్లో కేసీఆర్ను వారు మర్యా ద పూర్వకంగా కలిశారు. తమకు పదవులు ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.