జయశంకర్ భూపాలపల్లి : అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకెళ్తుంటే ప్రతిపక్షాలకు ఏం చేయాలో తెలియక బీఆర్ఎస్పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. వివిధ అభివృద్ధి పనులకు రూ.146.55 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
మెడికల్ కళాశాలలో హాస్టల్ ఇతర మౌలిక వసతుల కల్పన కోసం 110 కోట్లు, చెక్ డ్యాముల నిర్మాణానికి 16 కోట్లు, రోడ్లు సైడు కాలువలు నిర్మాణానికి 20.55 కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుంది. రైతు రుణమాఫీ చేయడం రైతులకు గొప్ప సదవకాశం అన్నారు. రైతు రుణమాఫీ, ఆర్టీసీ వీలినం, వీఆర్ఏల సర్దుబాటు గృహలక్ష్మి పథకం అమలు, బీసీ గురుకుల వృత్తుల వారికి, మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తుండడంతో ప్రతిపక్షాలకు దిక్కుతోచగా పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
సెప్టెంబర్ మొదటి వారంలో సీఎం కేసీఆర్ పర్యటన ఉంటుందని జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం, జిల్లా పోలీస్ కార్యాలయం, మెడికల్ కళాశాల భవనాలను ప్రారంభోత్సవం చేస్తారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక పైసా ఇవ్వకుండానే నిధులు ఇచ్చినట్లు పార్లమెంటులో చెప్పడం శోచనీయమన్నారు. మొరంచపల్లితో పాటు లోతట్టు గ్రామాల్లో ప్రభుత్వం సహాయక చర్యలను తక్షణమే చేపట్టిందన్నారు. చెరువులు, కుంటలు, రహదారులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు.