హైదరాబాద్: ఈ నెల 18 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నేడు టీఆర్ఎస్ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ప్రగతిభవన్లో మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో పార్లమెంటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, కేంద్రాన్ని నిలదీసే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై పోరాటాలని పిలుపునివ్వనున్నారు.
అన్ని రంగాల్లోనూ తెలంగాణకు నష్టం చేసేలా కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై పార్లమెంటు వేదికగా తీవ్ర నిరసన వ్యక్తం చేయాల్సిన తీరుపై ఎంపీలకు దిశా నిర్దేశం చేస్తారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులు, మిల్లర్లను ఇబ్బందులు పెడుతున్న తీరును ఎండగట్టేలా వ్యూహరచన చేస్తున్నారు.