హైదరాబాద్, 21 (నమస్తే తెలంగాణ): దేశరాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. ప్రజల ఎజెండాతో జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయవేదిక దిశగా బలమైన అడుగులు వేస్తున్నారు. శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సమాజ్వాదీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్యాదవ్తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని తుగ్లక్రోడ్లోని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి అఖిలేశ్ వచ్చారు. ఇద్దరు నేతలు రెండున్నర గంటలపాటు జాతీయ రాజకీయాలు, ప్రాంతీయ పార్టీల ఉనికి, భవిష్యత్ కార్యాచరణ వంటి విషయాలపై చర్చించారు. ఇటీవల జరిగిన యూపీ ఎన్నికలు..బీజేపీ అనుసరించిన దుర్మార్గ బుల్డోజర్ ప్రచారం, ఎన్నికల ఫలితాలు.. అనంతర పరిణామాలపై అఖిలేశ్.. సీఎం కేసీఆర్కు వివరించినట్టు సమాచారం.
కేంద్రంలోని మోదీ సర్కార్ రాష్ర్టాల హక్కులను కాలరాస్తూ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీస్తున్న వైనంపై చర్చించారు. బలమైన కేంద్రం.. బలహీన రాష్ర్టాలు అనే విధానంతో ముందుకు సాగుతున్న కేంద్రం వైఖరి పట్ల చర్చించినట్టు తెలుస్తున్నది. ప్రజల ఎజెండాతో జాతీయ ప్రత్యామ్నాయ వేదిక నిర్మాణం అవసరమని, అందుకోసం భావ సారూప్యత గల ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉన్నదనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ప్రాంతీయ పార్టీలు తమతమ రాష్ర్టాల ప్రయోజనాలను పరిరక్షించుకొంటూనే జాతిహితం కోసం ఆలోచించకపోతే భవిష్యత్తు తరాలు తీవ్రంగా నష్టపోతాయని సీఎం కేసీఆర్ అఖిలేశ్తో పేర్కొన్నట్టు సమాచారం. కేంద్రంలోని మోదీ సర్కార్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల ఫలితంగా కలుగుతున్న దుష్పరిణామాలపై ఈ భేటీ సందర్భంగా సుదీర్ఘ చర్చ సాగినట్టు విశ్వసనీయ సమాచారం.
కేంద్రం మూడు సాగుచట్టాలతో ఆందోళనకు గురైన దేశ రైతాంగం, తమ ప్రాణాలకు తెగించి ఉద్యమించిన నేపథ్యంలో విధిలేక కేంద్రం వాటిని రద్దుచేసి స్వయంగా దేశప్రధాని రైతాంగానికి క్షమాపణలు చెప్పుకోవాల్సిన దురవస్థపై చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. దేశ ప్రతిష్ఠను ప్రపంచ దేశాల్లో ఇనుమడింపచేస్తున్న ఎల్ఐసీ, రైల్వేస్, బీఎస్ఎన్ఎల్, ఓడరేవులు సహా పలు సంస్థలను అమ్మటమే విధానంగా పెట్టు కోవటం వల్ల కోట్లాది యువత భవిష్యత్తు ఉపాధి ప్రశ్నార్థకంగా మారవచ్చన్న అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం. ఇటీవలి కాలంలో దేశంలో జరుగుతున్న వర్గ హింస, మత విద్వేష రాజకీయాలకు కేంద్రం సహకరిస్తున్న తీరుపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తున్నది. వివిధ అంశాలపై సమాలోచనల అనంతరం సీఎం కేసీఆర్ నివాసంలోనే మధ్యాహ్న భోజనం చేసి అఖిలేశ్ వెళ్లిపోయారు. ఈ భేటీలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఎంపీలు గడ్డం రంజిత్రెడ్డి, వెంకటేశ్నేత, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.