హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నీటిపారుదలపై కీలక సమీక్ష చేపట్టారు. ఏపీతో కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో నీటిపారుదలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఈఎన్సీ, నీటిపారుదలశాఖ ఇంజినీర్లు హాజరయ్యారు.
కృష్ణా నీటి వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్కు ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని వాడుకుంటోందని లేఖలో జగన్ ఆరోపించారు. అదేవిధంగా కేఆర్ఎంబీ అనుమతి లేకుండానే విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ కృష్ణా జలాలను ఉపయోగిస్తోందన్నారు. వెంటనే దాన్ని నిలిపివేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలు సీఐఎస్ఎఫ్తో భద్రత కల్పించాలన్నారు. ఏపీ నీటి అక్రమ తరలింపు, ప్రధానికి వైఎస్ జగన్ లేఖ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిపారుదలపై కీలక సమావేశం నిర్వహించారు.