CM KCR | గత ప్రభుత్వాల పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని, గందరగోళ పరిస్థితులు ఉండేవని.. మళ్లీ ఆ దుర్మార్గులు వస్తే కరెంటు పోతుందని, ‘రైతుబంధుకు రాం రాం.. దళితబంధుకు జై భీమ్’ ఇదే పరిస్థితి వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లా ఎల్లపెల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మన చెరువులన్నీ ఒకనాడు ఎండిపోయి గందరగోళంగా ఉండేవి. ఇవాళ బ్రహ్మాండంగా చెరువులను నింపుకుంటున్నాం. ఎస్సారెస్సీ ద్వారా వచ్చే స్కీమ్ 27-28 ప్యాకేజీని త్వరలోనే పూర్తి చేయబోతున్నాం. నేను మీకు హామీ ఇస్తున్నా. ఎస్సారెస్సీ ద్వారా నిర్మల్, ముధోల్ నియోజకవర్గాలకు లక్ష ఎకరాలకు నీరు రాబోతున్నది. చెరవులు పండుగ జరుపుకుంటున్నాం.
8వ తేదీన గ్రామాల్లో కోలాహాలంగా, డప్పు చప్పుళ్లు, భాజాభజంత్రీలతో చెరువు కట్టల మీద పండుగ జరుపుకోవాలి. అనేక మంచి కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తున్నది. పేదలు, వృద్ధులు, ఒంటిరి మహిళలను ఆదుకుంటున్నాం. దేశంలోనే ఇవాళ తలసరి ఆదాయంలో తలమానికంగా, అగ్రభాగాన తెలంగాణ ఉన్నది. గతంలో కరెంటు ఎప్పుడు వస్తుందో.. పోతుందో తెలియదు. చాలా భయంకరమైన పరిస్థితులు ఉండేవి. ఇవాళ ఎవరూ రైతుల వద్దకు వచ్చి ఎవరైనా ఎన్ని మోటార్లు పెట్టావ్? ఎన్ని హెచ్పీల మోటార్లు పెట్టావని అడిగేవారే లేరు. రైతులు నిలబడాలని, వ్యవసాయం పండుగ కావాలని, రైతుల ముఖాల్లో చిరునవ్వు ఉండాలని ఎన్ని హెచ్పీల మోటార్లు పెట్టినా సంవత్సరానికి రూ.12వేలకోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఉచిత కరెంటు ఇస్తుంది. మళ్లీ ఈ దుర్మార్గులు వస్తే కరెంటు పోతది.
రైతుబంధుకు రాం రాం.. దళితబంధుకు జై భీమ్ ఇదే పరిస్థితి వస్తది. రైతుబంధు రాంరాం, దళితబంధుకు జై భీమ్ అనే వారు రాల్నా.. ప్రజలే నిర్ణయించాలి. ఎన్నికలు దగ్గరికి వచ్చినయ్ కాబట్టి అడ్డం పొడుగు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు. గోండుగూడాలు, లంబాడి తండాలు బాగుపడాలని ఎన్నో సంవత్సరాలు కొట్లాడారు. గ్రామ పంచాయతీలు కావాలని కోరారు. 60 సంవత్సరాల్లో ఎవరైనా చేశారా? తెలంగాణ ప్రభుత్వం 196 గ్రామ పంచాయతీలను గిరిజనుల కోసం ఏర్పాటు చేశారు. ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎవరికైతే సొంత జాగలున్నాయో.. నియోజకవర్గానికి 3వేల చొప్పున గృహలక్ష్మి పథకం కింద రూ.3లక్షలు మంజూరు చేస్తున్నాం. యాదవ సోదరులకు రెండో విడత కింద గొర్రెల పంపిణీని చేపట్టబోతున్నాం’ అని కేసీఆర్ ప్రకటించారు.