రామగిరి, జనవరి 23 : దేశంలో అర్చకులు, బ్రాహ్మణులకు అండగా నిలిచింది సీఎం కేసీఆర్ మాత్రమేనని తెలంగాణ అర్చక, ఉద్యోగ ఐక్యకార్యాచరణ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ కొనియాడారు. తెలంగాణ ధూప, దీప, నైవేద్య అర్చక సమాఖ్య (డీడీఎన్ఎస్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా వైదిక బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పెన్నా మోహనశర్మ నిర్వహించిన బ్రహ్మశ్రీ దివ్యజ్ఞాన సిద్ధాంతి రచించిన ‘శ్రీశుభకృత్’ నామ సంవత్సర పంచాంగాన్ని నల్లగొండలోని టీటీడీ కల్యాణ మండపంలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బ్రాహ్మణ, అర్చకులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ధూప, దీపానికి నోచుకోని పురాతన ఆలయాల్లో ధూప, దీప, నైవేద్య పథకం ద్వారా ప్రభుత్వం అర్చకులకు అండగా నిలిచిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,600 దేవాలయాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. మరో 2,800 దేవాలయాల్లో త్వరలో ధూప, దీప, నైవేద్య పథకం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసి రూ.245 కోట్లు కేటాయించిందన్నారు.