ములుగు : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ అన్నదాతలకు ఆపద్బాంధవుడయ్యారని రాష్ట్ర గిరిజన, స్త్రీ ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod) అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ములుగు జిల్లా చల్వాయి గ్రామంలో రైతు దినోత్సవంలో(Farmers Day) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ శతాబ్ది కాలంలో జరగని అభివృద్ధి దశాబ్ది కాలంలో జరిగిందని పేర్కొన్నారు. రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 2,601 వ్యవసాయ విస్తరణ అధికారుల క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.572.22 కోట్లు ఖర్చు చేసిందన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో రైతుబంధు, రైతుబీమా(Raitu Beema) పథకాలకు సీఎం కేసీఆర్(CM KCR) శ్రీకారం చుట్టారు.75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో రూ.50వేల కోట్లు రైతులకు పంట పెట్టుబడిగా అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. వ్యవసాయం దండగ కాదు, పండగ అని నిరూపించారని వెల్లడించారు.
సమైక్య పాలనలో వివక్షాపూరిత విధానాల కారణంగా తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ రంగం కుదేలైపోయిందని వివరించారు.గత ప్రభుత్వాల పాలనలోసాగునీరు లేదు. బోర్లపై ఆధారపడదామంటే కరెంటు లేదు. పెట్టుబడి లేదు. అప్పులతో, కుటుంబాన్ని పోషించలేక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడిన దుస్థితి ఉండేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిని సారించి అనేక సంక్షేమ పథకాలను(Welfare Schemes) అమలు చేశారని తెలిపారు.
రైతు రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకుందని వివరించారు. ములుగు జిల్లాను పర్యటన ప్రాంతంగా అభివృద్ధి చేశామని అన్నారు. సీఎం కేసీఆర్ కృషితోనే రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు.