MLC Kavitha | తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, రాష్ట్రంలోని మహిళల భద్రత బాధ్యతను సీఎం కేసీఆర్ తీసుకున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్రంలో మనకు కనిపిస్తున్న పోలీసులు మూడు సింహాలైతే కనపడకుండా.. వాళ్ల వెనుక ఉండి నడిపించే నాలుగో సింహం కేసీఆర్ అని తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లో హోంశాఖ నిర్వహించిన మహిళా సురక్ష సుంబురాల్లో కవిత పాల్గొన్నారు. తెలంగాణలో ఆడబిడ్డలకు ప్రాధాన్యం ఇచ్చే మంచి సంస్కృతి ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ఆడపిల్లల భద్రత, సంక్షేమ బాధ్యతలను సీఎం కేసీఆర్ తీసుకున్నారని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడిన కొద్దికాలంలోనే షీ టీమ్స్ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆడపిల్లలపై కన్నెత్తి చూస్తే తాటీస్తామన్న సందేశాన్ని ఇచ్చి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని చెప్పారు. తెలంగాణను స్ఫూర్తిగా తీసుకొని 18 రాష్ట్రాలు షీ టీమ్స్ను ఏర్పాటు చేశాయన్నారు. తెలంగాణ ఏర్పడితే నక్సలైట్ల రాజ్యం, రౌడీ రాజ్యం అవుతుందని, మతకల్లోలాలు జరుగుతాయని కొందరు అవహేళనగా మాట్లాడిన మాటలు పటాపంచలయ్యాయని స్పష్టం చేశారు.
గత తొమ్మిదేళ్లలో ఒక్క రోజు కూడా కర్ఫ్యూ లేదని, ఒక్క మతకల్లోలం జరగలేదని వివరించారు. పోలీసులు అద్భుతమైన భద్రత అందిస్తున్న కారణంగా ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వరదలాగా వస్తున్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా అర్ధరాత్రి 12 గంటలకు ఆడపిల్లలు ధైర్యంగా రోడ్లపై నడిచివెళ్లే పరిస్థితి ఉందని, మఖ్యంగా హైదరాబాద్ 100 నెంబర్కు ఫోన్ చేస్తే 7 నిమిషాల్లో పోలీసులు వస్తారని, గ్రామీణ ప్రాంతాల్లో 14వ నిమిషంలో పోలీసులు బాధితుల వద్దకు చేరుతున్నారని వివరించారు. ఇన్ని విజయాలు సాధిస్తున్న పోలీసులకు ప్రజానీకం తరఫున కవిత అభినందనలు తెలిపారు.