కాచిగూడ,మే 14: తెలంగాణలో ఒకేసారి 80 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేయడం చరిత్రాత్మక ఘట్టమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కొనియాడారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో శనివారం కాచిగూడలో నిర్వహించిన సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ.. నిరుద్యోగుల పక్షాన నిలిచి ఈ నోటిఫికేషన్లు జారీ చేయించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ కానిస్టేబుళ్లు, యూనిఫాం ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితిని 3 ఏండ్లు పెంచడం ద్వారా నిరుద్యోగుల హృదయాల్లో సీఎం కేసీఆర్ శాశ్వతంగా నిలిచిపోయారని ప్రశంసించారు.
మానవతా దృక్పథంతో కానిస్టేబుల్ ఉద్యోగార్థుల గరిష్ఠ వయోపరిమితిని మరో మూడేండ్లు పెంచాలని కోరారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనలో దేశవ్యాప్తంగా 16 లక్షలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. 1,653 ఐఏఎస్ పోస్టులు, 1,432 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. దేశ సంపదను మోదీ కేవలం గుజరాత్ రాష్ర్టానికే దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా యువతను ప్రభుత్వ యంత్రాంగంలోకి తీసుకొస్తే అవినీతికి తావులేకుండా పరిపాలన సజావుగా సాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు మన్నారం నాగరాజు, కోలా జనార్ధన్, గుజ్జ సత్యం, భూపేశ్సాగర్, రాజేందర్, అంజి, అనంతయ్య, జోషిరాఘవ, ప్రకాశ్, ఉపేందర్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.