హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు చెందిన స్పేస్టెక్ సంస్థ ‘ధ్రువ’ రూపొందించిన రెండు నానో శాటిలైట్స్ను శనివారం శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించడం పై సీఎం కే చంద్రశేఖర్రావు హర్షం వ్యక్తంచేశారు. ఇస్రోకు చెందిన పీఎస్ఎల్వీ-సీ54తో పాటు ధ్రువ సంస్థ పంపిన ‘థైబోల్ట్ 1, థైబోల్ట్ 2 రెండు నానో ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం కావడం దేశ ఔత్సాహిక అంకుర సంస్థల చరిత్రలో సుదినంగా నిలిచిపోతుందని, ఇది తెలంగాణ కీర్తిని దిగంతాలకు చాటిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ఉపగ్రహ ప్రయోగాల చరిత్రలో ప్రైవేటు రంగం ద్వారా మరో గొప్ప విజయం నమోదైందని అన్నారు. ఇటీవలే టీ హబ్ సభ్య సంస్థ సైరూట్ ‘విక్రమ్ ఎస్’ శాటిలైట్ను విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగాలతో భారత అంతరిక్షరంగ పరిశోధనకు హైద్రాబాద్ అంకుర సంస్థలు ద్వారాలు తెరిచాయని సీఎం అన్నారు. ప్రపంచ స్పేస్ ఎకానమీలో భారత్ వాటాను పెంచేందుకు ఉద్దేశించిన ప్రైవేట్ రాకెట్ల ప్రయోగానికి విక్రమ్-ఎస్, థైబోల్ట్-1, థైబోల్ట్-2 ప్రయోగాల విజయం శుభారంభాన్ని ఇచ్చిందని సీఎం పేర్కొన్నారు.
టీ హబ్లో మరెన్నో మైలురాళ్లు
ఉపగ్రహ ప్రయోగాల ద్వారా స్టార్టప్స్ సిటీగా హైదరాబాద్ విశిష్టత రెట్టింపు అయ్యిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఔత్సాహికుల ప్రతిభను వెలికితీయడం, పరిశ్రమలు, శాస్త్ర, సాంకేతిక, సమాచార రంగాల్లో అవకాశాల సృష్టే లక్ష్యంగా ప్రారంభించిన టీ హబ్లు భవిష్యత్తులో మరెన్నో మైలురాళ్లు దాటుతాయని తనకు నమ్మకం ఉందని, ఇది ఆరంభం మాత్రమేనని సీఎం ఆశాభావం వ్యక్తంచేశారు. స్పేస్టెక్ స్టార్టప్ సంస్థలు స్కైరూట్, ధ్రువ ప్రతినిధులను సీఎం కేసీఆర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ యువత మేధోసంపదను వెచ్చించి దేశ అభివృద్ధికి కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
యువతీయువకులకు, వారి అద్భుత ఆలోచనలను తమ అంకుర సంస్థల ద్వారా కార్యరూపమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని సీఎం స్పష్టంచేశారు. శాస్త్ర, సాంకేతిక, ఐటీ రంగాల్లో ఔత్సాహికులైన యువతీయువకుల ప్రతిభను వెలికితీసేందుకు కృషిచేస్తున్న రాష్ట్ర మంత్రి కేటీఆర్ను, ఉన్నతాధికారులను, టీహబ్ సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు.