జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణకు దేవుడిచ్చిన వరం సీఎం కేసీఆర్(CM KCR) అని హోం మంత్రి మహమూద్ అలీ(Home Minister) అన్నారు. తెలంగాణ సాధన కోసం 14 సంవత్సరాలు కష్టపడ్డట్టుగానే తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి (Jaya shanker )జిల్లా టేకుమట్ల పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించారు. పలిమేల, కాళేశ్వరం పోలీసు స్టేషన్ల నూతన భవనాలను వర్చువల్ గా ప్రారంభించి మాట్లాడారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు(Law and Order) మెరుగ్గా ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందన్న లక్ష్యంతో పోలీస్శాఖ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. పోలీస్ స్టేషన్లకు నూతన భవనాలు, వాహనాల ఏర్పాటుకు నిధులు కేటాయించారని తెలిపారు. పోలీస్ అధికారులు, సిబ్బంది సంతోషంతో ఉన్నారని, రాష్ట్ర పోలీసులు సమర్ధవంతంగా పనిచేస్తూ శాంతి భద్రతలను కాపాడుతున్నారని వివరించారు.
మహిళల రక్షణకు షీ టీం( She Teams) లను , భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. జపాన్ తరహలో తెలంగాణ పోలీసులు((Telangana Police) పనిచేస్తున్నారని ప్రశంసించారు. దేశంలోనే తెలంగాణ అన్నింటా నంబర్వన్గా ఉందని అన్నారు. కార్యక్రమంలో డీజీసీ అంజనీ కుమార్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ కోలేటి దామోదర్, భూపాలపల్లి, వరంగల్, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లు శ్రీ హర్షిణీ, గండ్ర జ్యోతి, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవష్ మిశ్రా ,జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టిఎస్ దివాకర, స్థానిక ప్రజా ప్రతినిధులు తాసిల్దార్, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.