సూర్యాపేట : దళితులను ఆర్థికంగా సుసంపన్నం చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చివ్వెంల మండలం తుల్జారావు పేటలో ఆయన దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు. లబ్ధిదారులకు ఆయా యూనిట్లను అందజేసి వారితో కలసి సహపంక్తి భోజనం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతుందన్నారు. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో పాలకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అదే అమలు పరుస్తున్నారని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళితబంధు పథకం కుడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించిందేనని స్పష్టం చేశారు.
దళితబంధు పథకంతో దళితులు ఆర్థికాభివృద్ధి సాధించడంతో పాటు సమాజాన్ని నిర్దేశించే వ్యక్తులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం దళిత బంధు లబ్ధిదారులతో కలసి ఆయన సహపంక్తి భోజనం చేశారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎంపీపీ ధారావత్ బాబు నాయక్, జడ్పీటీసీ సంజీవ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.