హైదరాబాద్, ఫిబ్రవరి7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర బడ్జెట్లో విద్యా, సంక్షేమ రంగాలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని మంగళవారం ఒక ప్రకటనలో బీసీ కమిషన్ సభ్యుడు కే కిశోర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ‘మన ఊరు-మన బడి’ ద్వారా ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దకిందని కొనియాడారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తున్నదని వివరించారు. దేశంలోనే అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేసి పేదలు, అణగారిన వర్గాలకు ఉచిత, నాణ్యమైన విద్యను అందిస్తున్నారని అన్నారు. బడ్జెట్లో విద్యారంగానికి రూ.19,023 కోట్లు, బీసీ సంక్షేమ శాఖకు రూ.6,220 కోట్లు కేటాయించడంపై సంతోషం వ్యక్తం చేశారు. అందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
బడుగుల బడ్జెట్ ఇది
రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెట్టిందని నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బడ్జెట్లో బడుగు బలహీన బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియాడారు. 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు కోసం నాయీబ్రాహ్మణులకు రూ.50 కోట్లు, రజకులకు రూ.59 కోట్ల 70 లక్షలు కేటాయించడంతోపాటు అన్ని ఫెడరేషన్లకు నిధులు కేటాయించారని ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
బడ్జెట్లో సమప్రాధాన్యం
బడ్జెట్లో అన్ని వర్గాలకు సమప్రాధాన్యం కల్పించారని జన గణన వేదిక నేషనల్ చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ ఒక ప్రకటనలో కొనియాడారు. బడ్జెట్ అంటే నెంబర్స్ కాదని, అన్ని వర్గాల సామాజిక ఆర్థిక అభివృద్ధి అని పేర్కొన్నారు. సమైక్య పాలనలో బడుగు, బలహీన వర్గాలను ఎవరూ పట్టించుకోలేదని, తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలు, కులాలకు ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. క్యూబా తరహాలో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని అన్నారు.