నల్లగొండ : పోరాడి సాధించిన తెలంగాణలో గత ఎనిమిదేళ్లుగా అన్ని రంగాల అభివృద్ధితో పాటు చేతివృత్తులకు చేయుతనదిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం కులవృతిపై ఆధారపడి జీవిస్తున్న కుమ్మరి కులస్తులకు రూ 6.40 లక్షల వ్యయంతో ఆధునిక యంత్రాలను అందించారు. గత ఉమ్మడి పాలకుల హయాంలో కనుమరుగయ్యే స్థితికి చేరిన కులవృత్తులను నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్నివిధాలుగా ప్రోత్సహిస్తూ.. వృత్తిదారుల ఆత్మగౌరవం మరింత పెంచినామన్నారు. అందుకే యావత్ దేశం మన తెలంగాణ అభివృద్ధి వైపు చూస్తుందని.. మన ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకత్వాన్ని కోరుకుంటుందన్నారు.
రాబోయే రోజుల్లోనూ ఐక్యతతో ప్రశాంత వాతావరణంలో అన్ని రంగాలను మరింత అభివృద్ధి పథంలో నడుపుకుందామన్నారు. అనంతరం లబ్ధిదారుల కుటుంబాలకు ఆధునిక విద్యుత్ కుమ్మరి యంత్రాలతో పాటు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ఇప్పటికే జిల్లా కేంద్రంలో రూ.80లక్షల వ్యయంతో కుమ్మరి సంఘ భవనం నిర్మించడంతో పాటు కులవృతిపై ఆధారపడిన కుమ్మరి కులస్తులకు ఆధునిక విద్యుత్ పరికరాలు పంపిణీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఆ సంఘం నాయకులు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, ఎంపీపీ నెమ్మది భిక్షం తదితరులు పాల్గొన్నారు.