హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తున్నారని, దళితుల సముద్ధరణ కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకమే అందుకు నిదర్శనమని యూపీకి చెందిన దళిత నాయకుడు, సామాజిక కార్యకర్త రాఘవేంద్ర కుమార్ కొనియాడారు. దళితబంధు అమలు తీరుపై హర్షం వ్యక్తం చేశారు. లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి పథకం విశేషాలను తెలుసుకొని ఆనందం వ్యక్తం చేశారు. యూపీలో దళితుల పరిస్థితిని వివరించి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని 26 రాష్ర్టాలకు చెందిన రైతు సంఘాల నాయకులు గత రెండు రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా రాష్ర్టానికి విచ్చేసిన రాఘవేంద్ర కుమార్ దళితబంధుపై ప్రత్యేక ఆసక్తిని కనబర్చారు.
ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ వద్ద ప్రస్తావించారు. దీంతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దళితబంధు తీరును ఆయనకు వివరించాలని ఎమ్మెల్యే బాల్క సుమన్కు సీఎం సూచించారు. సీఎం ఆదేశాలతో ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్, జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్, పథకం లబ్ధిదారులతో కలిసి డీఎస్ఎస్ భవన్లో ఆదివారం ఉదయం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశా రు. తొలుత బాల్క సుమన్ దళితబంధు విశిష్టతలను వివరించారు. ఎస్సీలు అన్ని వర్గాలతో సమానంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని రూపొందించారని తెలిపారు.
30 ఏండ్ల కిందటే కేసీఆర్ ఎస్సీల ఉన్నతికి దళిత చైతన్య జ్యోతిని తీసుకొచ్చారని, దాని స్ఫూర్తితోనే దళితబంధుకు శ్రీకారం చుట్టారని వెల్లడించారు. పథకం అమలుకు ఇప్పటి వరకు రూ.3,600 కోట్లు వెచ్చించి 35 వేల యూనిట్లను గ్రౌండింగ్ చేశారని చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్లో పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించినట్టు వివరించారు. మొత్తం రాష్ట్రంలోని సుమారు 19 లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నదని తెలిపారు. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన 70 మంది దళితబంధు లబ్ధిదారుల నుంచి రాఘవేంద్ర కుమా ర్ స్వయంగా మాట్లాడారు. పథకం ద్వారా పొం దిన ప్రయోజనాలను అడిగి తెలుసుకొన్నారు.
దళిత సీఎంలూ కేసీఆర్లా ఆలోచించలేదు: రాఘవేంద్ర కుమార్
ఏ దళిత సీఎం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్లా ఆలోచించలేదని, దళితుల అభ్యున్నతికి ఇలాంటి పథకాలు రూపొందించలేదని రాఘవేంద్ర కుమార్ కొనియాడారు. యూపీలో ఎస్సీలు కఠిన పేదరికాన్ని అనుభవిస్తున్నారని చెప్తూ కంటతడి పెట్టారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు అనేక అంశాల్లో దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలుస్తున్నదని శ్లాఘించారు. దళితబంధును అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దళితులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.