CM KCR | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇప్పటికే రైతులకు రైతుబీమా అమలు చేస్తున్నది. ఇదే తరహాలో గీత కార్మికులకు సైతం ‘గీత కార్మికుల బీమా’ను అమలు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించారు. కల్లు గీసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో మృతుడి కుటుంబానికి రూ.5లక్షల బీమా సాయాన్ని నేరుగా ఖాతాలో జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపాందించాలని, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావును సీఎం ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కల్లుగీత సందర్భంగా ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోతున్న దురదృష్ట సంఘటనలు జరుగుతుంటాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
అలాంటి ఊహించని దురదృష్టకర సందర్భాల్లో మరణించిన కల్లుగీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. ఇప్పటికే ఎక్స్ గ్రేషియా అందిస్తున్నా బాధితులకు అందడంలో ఆలస్యమవుతున్నదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతన్నల కుటుంబాల కోసం అమలు చేస్తున్న రైతుబీమా తరహాలోనే, కల్లుగీతను వృత్తిగా కొనసాగిస్తున్న గౌడన్నల కుటుంబాలకు వారం రోజుల్లోనే బీమా నగదు అందేలా ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం అన్నారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని మంత్రులకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం ఆదేశాలు జారీ చేశారు.