హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా నూతన సచివాలయం నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని ఆదేశించారు. సెక్రటేరియట్లోని అన్ని విభాగాల పనులను అద్భుతంగా, సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. సచివాలయం నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ బుధవారం పరిశీలించారు. నిర్మాణం జరుగుతున్న భవనాలన్నింటినీ కలియతిరిగిన సీఎం పనులను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు నిర్దేశించుకున్న డిజైన్ల ప్రకారం జరుగుతున్నాయా? అని మంత్రిని, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏకకాలంలో అన్ని పనులు వేగంగా పూర్తిచేయడానికి అవసరమైన అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆలస్యం కావొద్దని పేర్కొన్నారు. శ్లాబుల నిర్మాణం, భవనంపైన డూమ్స్ ఏర్పాటు, ఇంటీరియర్ పనులతోపాటు ఫర్నీచర్ విషయంలో నూతన మాడల్స్ను ఎంపిక చేసుకోవాలని సీఎం సూచించారు. మంత్రుల చాంబర్లు, మీటింగ్ హాల్స్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
అద్భుతంగా గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్..
భవనం మధ్య భాగంలో సుమారు రెండు ఎకరాల ఖాళీ స్థలంతోపాటు, సెక్రటేరియట్ ప్రాంగణంలో పచ్చదనం, ఉద్యానవనాల పనులు అద్భుతంగా ఉండేలా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గ్రిల్స్ నిర్మాణ పనుల నాణ్యత గురించి ఆరా తీశారు. రెడ్స్టోన్, డ్రైనేజీ నిర్మాణ పనులను సైతం పరిశీలించారు. విజిటర్స్ లాంజ్ నిర్మాణ పనులను, సరిహద్దు గోడ వెంబడి మట్టి నింపే పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. సెక్రటేరియట్కు వచ్చే విదేశీ ప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సందర్శకులకు సౌకర్యవంతంగా ఉండేలా పారింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. నిర్మాణంలో ఉన్న సెక్రటేరియట్లోనే.. పనులు జరుగుతున్న తీరుపై సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. పనులకు సంబంధించిన ఆల్బమ్ను పరిశీలిస్తూ, ఒకో పని గురించి సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు.
సీఎంతోపాటు మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, మల్లారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్ కుమార్, ఎంపీ దీవకొండ దామోదర్రావు, ఎమ్మెల్సీలు శంభీపూర్రాజు, కే నవీన్కుమార్, ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, అరికెపూడి గాంధీ, కేపీ వివేకానంద, బేతి సుభాష్రెడ్డి, ఏ జీవన్రెడ్డి, సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ వేద సాయిచంద్, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.