హైదరాబాద్, మార్చి 23(నమస్తే తెలంగాణ) : ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం పర్యటించారు. ఉదయం బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయల్దేరిన సీఎం.. తొలుత ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రామాపురం గ్రామానికి చేరుకుని అక్కడి రైతులను పరామర్శించారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంటతండా, తర్వాత వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవిరంగాపురం, తర్వాత కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలం లక్ష్మీపురం గ్రామానికి చేరుకున్నారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో నష్టపోయిన పంటలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశమయ్యారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో పంట నష్టానికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు.
పంట పొలాల్లో తిరుగుతూ… రైతుల కష్టాలు వింటూ..
సీఎం కేసీఆర్ తన పర్యటన ఆసాంతం రైతుల్లో భరోసా నింపేందుకు ప్రయత్నించారు. ప్రతి గ్రామంలోనూ రైతుల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారితో కలిసి పొలాల్లో కలియ తిరుగుతూ.. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఏ పంట ఎన్ని ఎకరాలు వేశారు?.. ఎంత దెబ్బతిన్నది?.. ఎంత పెట్టుబడి పెట్టారు?.. వంటి విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా హడావిడి లేకుండా ప్రతి రైతుతోనూ మాట్లాడి వారి సమస్యలనూ ఓపికతో విన్నారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధను సీఎం కేసీఆర్కు విన్నవించుకున్నారు. దెబ్బతిన్న పంటలను చూపుతూ కన్నీరు పెట్టుకున్నారు.
‘మీ ధైర్యమే నా ధైర్యం. ఎవరూ ఆందోళన చెందవద్దు. మీకోసం నేనున్నాను. నష్టపోయిన ప్రతి రైతునూ అన్నివిధాలా ఆదుకుంటాం’ అని రైతులకు కేసీఆర్ ధైర్యం చెప్పారు. రైతులను ఎప్పటికీ తమ ప్రభుత్వం ఒంటరిగా వదిలిపెట్టబోదని.. ఏ కష్టమొచ్చినా అండగా ఉంటామని, ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని రైతుల కష్టాలు తీర్చేందుకు లక్షల కోట్లు ఖర్చు చేసి ఎన్నో పనులు చేశామని.. ఇందులో భాగంగానే పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేల చొప్పున పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ పైసలను వెంటనే రైతులకు అందిస్తామని తెలిపారు. అలాగే కౌలు రైతులనూ ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.