న్యూఢిల్లీ: బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీలోని సర్దార్పటేల్ రోడ్డు గులాబీమయమైంది. ఎస్పీ రోడ్లో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు, కటౌట్లతో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. మరోవైపు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పార్టీ శ్రేణులు, ముఖ్య నేతలతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.
దేశంలో గుణాత్మక మార్పు కోసం నడుంకట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మరికాసేపట్లో ఢిల్లీలో బీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించబోతున్నారు. ఢిల్లీ నడిబొడ్డున సర్దార్ పటేల్ రోడ్డులో పార్టీ జాతీయ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:37 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు.
కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలు హస్తినకు చేరుకున్నారు. సీఎం సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత, మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.