హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా జరిగింది. నిర్ణయించిన ముహూర్తానికి ముఖ్యమంత్రి, మంత్రులు, ఆయా శాఖల అధిపతులు తమతమ కార్యాలయాల్లో పూజలు నిర్వహించి సీట్లలో ఆసీనులయ్యారు. సీఎం సహా మంత్రులంతా ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో తరలిరావడంతో సచివాలయంలో పండుగ వా తావరణం నెలకొన్నది.
మధ్యాహ్నం 1.16 గంటలకు సీఎం కేసీఆర్ సచివాలయ ప్రాంగణానికి చేరుకోగా రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ తదితరులు స్వాగతం పలికారు. సీఎం ముందుగా సచివాలయం ముందున్న యాగశాలకు చేరుకొని సుదర్శన హోమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రధాన ద్వారం వద్ద సచివాలయ ప్రారంభ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రధాన ద్వారం వద రిబ్బన్ను కట్చేసి సచివాలయంలోనికి ప్రవేశించారు. ముందుగా గ్రౌండ్ఫ్లోర్లో వాస్తుపూజలో పాల్గొని, నేరుగా లిఫ్టు ద్వారా ఆరో అంతస్థుకు చేరుకొన్నారు. సీఎం చాంబర్లో పూజలు నిర్వహించారు. తన సీటులో ఆసీనులై ఆరు కీలక దస్ర్తాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కిషన్రావు, ఈవో గీతతో కలిసి యాదాద్రి కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరించారు.
పండుగ వాతావరణం…
ఆదివారం సెలవుదినం అయినప్పటికీ సచివాలయ ప్రారంభం సందర్భంగా అధికారులు, ఉద్యోగులు తమ కుటుంబసభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంత్రులు, శాఖాధిపతుల కార్యాలయాలను పూలతో అలంకరించడంతో పండుగ వాతావరణాన్ని తలపించింది. ఎక్కడ చూసినా ఉద్యోగుల కోలాహలం కనిపించింది. కార్యాలయాలు అత్యంత విలాసవంతం గా ఉండడంతో అధికారులు, ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. సీఎం, మం త్రులు, అధికారులు తమ సీట్లలో ఆసీనులైన త ర్వాత అందరూ సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సభాస్థలికి చేరుకున్నారు. ఉద్యోగుల కుటుంబ సభ్యుల పాటు మంత్రులు, ప్రజాప్రతినిధుల అనుచరులు కూడా పెద్దసంఖ్యలో రావడంతో సభా ప్రాంగణం కిటకిటలాడింది. సీఎం కేసీఆర్ ప్రసంగం వినేందుకు ఎంతో ఆసక్తి ప్రదర్శించారు.
సీఎం సమక్షంలో సీఎస్ తొలి సంతకం
సీఎం తమ కార్యాలయానికి పక్కనే ఉన్న సీఎస్ కార్యాలయానికి వెళ్లారు. సీఎస్ శాంతికుమారి సీఎం కేసీఆర్ సమక్షంలో తన సీటులో ఆసీనులై దస్త్రంపై తొలి సంతకం చేశారు. సీఎస్ రాష్ట్రంలోని పాఠశాలల్లో బాలికల భద్రత కోసం సేఫ్టీ క్లబ్లను ఏర్పాటుచేసే ఫైల్పై తొలి సంతకం చేశారు. అంతకు ముందు ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్రావుతోపాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సీఎస్ను అభినందించారు. సీఎం కేసీఆర్ను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తమిళనాడులోని మధురై నుంచి తెప్పించిన ప్రత్యేక పూలహారం, శాలువాతో సత్కరించారు. నేడు కూడా పనిచేయనున్న సచివాలయం సోమవారం కూడా రాష్ట్ర సచివాలయం పనిచేయనున్నది. మే డే అయినప్పటికీ ఉద్యోగులకు సెలవు లేదు. సీఎం కేసీఆర్ సహా మంత్రులంతా సోమవారం యథావిధిగా విధులకు హాజరుకానున్నారు.
ఘనంగా సుదర్శన యాగం
నూతన సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా సుదర్శన యాగం, చండీ హోమం, వాస్తు పూజ తదితర కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. మంత్రి ప్రశాంత్రెడ్డి దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రశాంత్రెడ్డి దంపతులు ఉదయం 6.15 గంటలకు సచివాలయ ప్రధాన ద్వారం వద్ద గుమ్మడికాయ కొట్టి ద్వారలక్ష్మి పూజ నిర్వహించారు. అనంతరం యాగ క్రతువులో పాల్గొన్నారు. వాస్తు నిపుణులు సుధాకర్ తేజ ఆధ్వర్యంలో, శృంగేరీ పీఠం వారి సమక్షంలో 120 మంది రుత్వికులతో ఈ కార్యక్రమం నిర్వహించారు. 11.10 గంటలకు పూర్ణాహుతితో యాగం పరిపూర్ణమైంది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అందరికీ విందు భోజనం
ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చినవారందరికీ విందు భోజనం ఏర్పాటుచేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు, వివిధ శాఖాధిపతులు, ఉద్యోగులకు విడివిడిగా షామియానాలు ఏర్పాటుచేసి వివిధ రకాల ఆహారపదార్థాలను వడ్డించారు. సీఎం కేసీఆర్ కూడా ఉద్యోగులతో కలిసి భోజనం చేశారు. సుమారు 2000 మందికి సరిపడా శాఖాహార, మాంసాహార భోజనాలు ఏర్పాటుచేశారు. సభా ప్రాంగణంలో మంచినీటి బాటిళ్లు, మజ్జిగ పంపిణీచేశారు. ఎవరికైనా అనారోగ్య సమస్య తలెత్తితే వెంటనే స్పందించేందుకు వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్టాళ్లను కూడా ఏర్పాటుచేశారు.