CM KCR | జోగులాంబ గద్వాల కలెక్టరేట్ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం ప్రారంభించారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి.. అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం చాంబర్లో కలెక్టర్ వల్లూరి క్రాంతిని కూర్చోబెట్టి.. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, డీజీపీ అంజనీకుమార్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం, ఆల వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రాల ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జోగులాంబ గద్వాల జిల్లాలలో సకల సదుపాయాలతో సమీకృత కలెక్టరేట్ను నిర్మించింది. కలెక్టరేట్ భవనాన్ని రూ.51.18 కోట్లతో మూడు అంతస్తుల్లో నిర్మించింది. వివిధ శాఖలకు చెందిన 36 జిల్లా స్థాయి కార్యాలయాలను ఏర్పాటు చేశారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయం 1.39 లక్షల చదరపు మీటర్లలో 46 గదులతో ఏర్పాటైంది. కలెక్టర్ చాంబర్తోపాటు అదనపు కలెక్టర్ల చాంబర్లు, వీడియో కాన్ఫరెన్స్హాల్తో పాటు విశ్రాంతి హాల్ నిర్మించారు. మొదటి, రెండో అంతస్తులో జిల్లా అధికారుల కార్యాలయాలు, సమీపంలోనే ముఖ్య అధికారులు ఉండేలా ఎనిమిది నివాస భవనాలు నిర్మించారు. కార్యాలయ ఆవరణలోని గార్డెనింగ్, కాకతీయుల కాలం నాటి స్తంభాలను కలెక్టరేట్ ముందు భాగంలో నిర్మించడంతో కలెక్టరేట్ ప్రత్యేక శోభ సంతరించుకున్నది.