CM KCR | జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభోత్సవం చేశారు. మొదట కార్యాలయానికి చేరుకున్న సీఎంకు హోంమంత్రి మహమూద్ అలీ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, డీజీపీ అంజనీకుమార్తో పాటు పోలీసు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎంకు పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కార్యాలయ శిలాఫలకాన్ని ప్రారంభించారు. కార్యాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎస్పీ చాంబర్లో జిల్లా పోలీస్ అధికారి సృజనను కూర్చోబెట్టి.. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలా ఉండగా.. గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయ సముదాయాన్ని ప్రభుత్వం రూ.38.50 కోట్లతో నిర్మించింది. కార్యాలయంలో సిబ్బంది విధులు నిర్వహించేందుకు నాలుగు ఫోర్లు, 45 గదులు, సమీక్ష సమావేశాల కోసం కాన్ఫరెన్స్హాల్, ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేశారు. సాయుధ దళపతి కార్యాలయంతోపాటు ఆర్మ్డ్ సిబ్బంది ఉండేలా రెండు బరాక్లు నిర్మించారు. ల్యాబ్ సౌకర్యం, ఫోరెన్సిక్, సైబర్, క్లూస్టీం కోసం సైతం వసతులు కల్పించారు. డాగ్, బాంబ్ స్కాడ్ సిబ్బందికి వసతి కూడా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం, ఆల వెంకటేశ్వర్రెడ్డి, కలెక్టర్ వల్లూరి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.