చేతిలో పెన్నుందని, దానిలో సిరా ఉందని రాసేవారు కొందరు.
నోరుందని, నోట్లో నాలుక ఉందని మాట్లాడేవాళ్లు కొందరు.
భాషను అర్థం చేసుకోలేని, భావ దరిద్రులు కొందరు!
ఈ నేల మీద ఉంటూ, ఈ గాలి పీలుస్తూ, ఈ నీరు తాగుతూ, ఇక్కడి సౌకర్యాలను అనుభవిస్తూ కూడా కంటి నిండా అసూయను, కడుపు నిండా అక్కసును నింపుకొని ఆక్రోశంతో, అజీర్తి వాంతులు చేసుకునే వాళ్లు కొందరు!
‘తెలంగాణ పునర్మిర్నాణం’ అంటే ఏమిటి? తెలంగాణ మొత్తాన్ని కూల్చేసి మళ్లీ కడతారా? అనే చెత్త ప్రశ్నలు వేసిన వాళ్లు కొందరు!
వాళ్లు ఎవరో తెలంగాణ ప్రజలకు మాబాగా తెలుసు!!
ఇలాంటి వాళ్లకు చెప్పుతో కొట్టినట్టు సమాధానమిచ్చారు మన ముఖ్యమంత్రి. పునర్నిర్మాణం అంటే ఏమిటో చచ్చు పుచ్చు బుర్రలకు అర్థమయ్యేలా, అదిరిపోయేలా ఉద్బోధించారు. తొమ్మిదేండ్ల ప్రత్యేక తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని మాటలతో కండ్లకు కడుతూ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చామో వివరించారు కేసీఆర్!! కష్టాల, నష్టాల నుంచి కావడి కుండలతో జారుడు బండపై నిలిచిన తెలంగాణ.. అనూహ్య రీతిలో అప్రతిహతమైన అభివృద్ధిని ఎలా సాధించిందో ముఖ్యమంత్రి చెప్తుంటే వింటున్న ప్రతి ఒక్కరి కంటినిండా వెలుగే ఆనందబాష్పమైంది.
వైభవోపేతంగా నిర్మించిన ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ నూతన సచివాలయ’ భవనాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. తెలంగాణ అమాత్యులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు, అతిరథ మహారథుల సమక్షంలో, వందలాది వేదపండితుల వేదాశీర్వచనాల ప్రతిధ్వని నడుమ, పవిత్ర హోమ, ధూమ సన్నిధిలో ముఖ్యమంత్రి, మంత్రులు తమ చాంబర్లలో ప్రవేశించి ఆసనాలను అలంకరించారు. నూతన సచివాలయంలో కొత్త చాంబర్లో తొలిరోజు పలు ప్రజోపయోగ ఫైళ్ల మీద సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సందేశమిస్తూ ప్రత్యేక రాష్ట్రంగా తొమ్మిదేండ్లలో తెలంగాణ పయనాన్ని సూటిగా, నీటుగా, దీటుగా, ఘాటుగా నివేదించారు. దశాబ్దాలపాటు దారిద్య్రాన్ని అనుభవించిన తెలంగాణ తొమ్మిదేండ్లలోనే సంపన్న రాష్ట్రంగా ఎలా అవతరించిందో ముఖ్యమంత్రి వివరిస్తుంటే విశ్వరూప సందర్శనమైంది.
సమైక్య పాలనలో చిక్కిశల్యమైన, శిథిలమైన చెరువులను పునరుద్ధరించుకున్నం. రాగి పైసా వేద్దామన్నా గోదావరిలో నీటిగుంత వెతుక్కోవాల్సిన దుస్థితి నుంచి ప్రపంచ ఇంజినీరింగ్ అద్భుతం కాళేశ్వరాన్ని కట్టుకున్నం. ..ఇదీ పునర్నిర్మాణమంటే
ఉపనదులు, వాగులపై నిర్మించిన చెక్డ్యాములతో మండుటెండల్లోనూ మత్తళ్లు దుంకుతున్నాయి. నెర్రెలు బారిన భూములు నేడు లక్షల ఎకరాల్లో పంటలతో హరిత కాంతులు వెదజల్లుతున్నాయి. ..ఇదీ పునర్నిర్మాణమంటే
అర్ధరాత్రి పొలాలకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న దుస్థితి నుంచి.. పగటి పూటనే దర్జాగా తెలంగాణ రైతు నీళ్లు పారించుకుంటున్నడు. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లతో గడిపిన దుస్థితి నుంచి నిరంతరాయ వెలుగులతో తెలంగాణ విరాజిల్లుతున్నది. ..ఇదీ పునర్నిర్మాణమంటే
ఒకప్పుడు పాలమూరు అంటే వలస కూలీలు. ఇప్పుడు వారి సొంత పొలాల్లో ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు వచ్చి పనులు చేస్తున్నారు. ..ఇదీ పునర్నిర్మాణమంటే
ఫ్లోరైడ్ రక్కసికి చిక్కిన జీవితాలను మార్చింది మిషన్ భగీరథ. బంజారాహిల్స్ నుంచి గోండుగూడెం దాక అందరికీ స్వచ్ఛమైన నీరు అందుతున్నది. ..ఇదీ పునర్నిర్మాణమంటే
నలువైపులా సూపర్స్పెషాలిటీ దవాఖానలు, హెల్త్ యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలతో వైద్యరంగంలో కొత్త చరిత్రను రాస్తున్నం. ..ఇదీ పునర్నిర్మాణమంటే
33 కొత్త జిల్లాలు, ప్రతి జిల్లాలో కొత్త కలెక్టరేట్లు, కొత్త జిల్లా పోలీస్ కార్యాలయాలు.. అక్కడి నుంచి వెలుగులీనుతున్న పరిపాలనా కాంతులను చూడొచ్చు. ..ఇదీ పునర్నిర్మాణమంటే
ఐటీ రంగంలో బెంగళూరునూ దాటి హైదరాబాద్ తారాజువ్వలా దూసుకు పోతున్నది. నూతన పారిశ్రామికవిధానాలతో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షిస్తూ దేశంలోనే అగ్రస్థానంగా నిలుస్తున్నది. ..ఇదీ పునర్నిర్మాణమంటే
అత్యాధునిక సౌకర్యాలు, మౌలిక వసతులు, అబ్బురపరిచే నిర్మాణాలతో అంతర్జాతీయ నగరాలకు దీటుగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ..ఇదీ పునర్నిర్మాణమంటే
పదేండ్లుగా చిన్న మతకల్లోలానికి తావివ్వకుండా, అరాచక మూకల పీచమణుస్తూ పోలీసింగ్లో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నది. ..ఇదీ పునర్నిర్మాణమంటే
ఒకప్పుడు కునారిల్లిన గ్రామాలు, మురికికూపాలుగా ఉన్న పట్టణాలు అద్భుత అభివృద్ధితో జాతీయ అవార్డులు సొంతం చేసుకుంటున్నాయి. ..ఇదీ పునర్నిర్మాణమంటే
యాదాద్రి పునర్నిర్మిత ఆలయం భూలోక వైకుంఠంగా వెలుగొందుతున్నది. అక్కడి నుంచి లక్ష్మీనారసింహుడు ప్రజలను ఆశీర్వదిస్తున్నారు. ..ఇదీ పునర్నిర్మాణమంటే
రూ.3.17 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే నంబర్వన్ స్థాయికి తెలంగాణ ఎదగడమే కదా పునర్నిర్మాణం. అంతర్జాతీయంగా అభివృద్ధికి సూచికగా పరిగణించే తలసరి విద్యుత్తు వినియోగంలో 1,100 యూనిట్ల నుంచి నేడు 2,140 యూనిట్లకు పెరిగింది రాష్ట్రం. తలసరి విద్యుత్తు వినియోగంలో దేశంలోనే అగ్రభాగాన ఉన్నది. ..ఇదీ పునర్నిర్మాణమంటే
ఒకప్పుడు పింఛన్ చార్జీలకే సరిపోయేది. ఇప్పుడు ఆసరా పింఛన్ అందుకుంటున్న ముఖాలు సంతోషంతో వెలుగుదివ్వెలవుతున్నాయి. ..ఇదీ పునర్నిర్మాణమంటే
అష్టావక్రంగా, అడ్డదిడ్డంగా ఎండలో వానలో ఫైళ్లు పట్టుకొని పరుగెత్తే దుస్థితి నుంచి… అద్భుతంగా, శోభాయమానంగా, శిఖర ప్రాయంగా మన హైదరాబాద్లో.. ‘నేను తెలంగాణ సచివాలయాన్ని’ అని చెప్తూ సగర్వంగా తలెత్తి నిలిచిన ఈ సెక్రటేరియటే తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీక. తెలంగాణ సాధించిన ప్రగతికిది తార్కాణం. ఇది తెలంగాణ గుండెకాయ. – సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నడిబొడ్డున శోభాయమానంగా నిలబడి ఉన్న రాష్ట్ర నూతన సచివాలయం తెలంగాణ సాధించిన ప్రగతికి తార్కాణమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఈ ప్రగతిలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి కృషి ఉన్నదని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కొందరు మరుగుజ్జులు వెకిలి మాటలు మాట్లాడారని, వారి విమర్శలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగినట్టు చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయాన్ని సీఎం ఆదివారం ప్రారంభించారు. స్వరాష్ట్ర పోరాటంలో ప్రాణాలర్పించిన అమరులకు జోహార్లు అర్పించారు. అనంతరం జరిగిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
తెలంగాణ ప్రగతి యజ్ఞంలో 9 ఏండ్లుగా నాతోపాటు కలిసి సాగుతున్న ప్రతి ఒక్క ప్రభు త్వ అధికారికి, ఉద్యోగికి చేతులెత్తి హృదయ పూర్వకంగా నమస్కరిస్తున్నా. ఇక్కడ సచివాలయం ఎంత సమున్నతంగా ఉన్నదో.. తెలంగాణ పల్లెలు కూడా అంతే అద్భుతంగా అలరారుతున్నాయి. తెలంగాణలో ఉన్నంత అద్భుతంగా పల్లెలు దేశంలో మరెక్కడా లేవు. ఒకటి రెండు కాదు.. అనేక విభాగాల్లో అద్భుత ప్రగతి సాధించినం. చాలా అద్భుతాలు జరిగాయి. తెలంగాణ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేసి ఒక అద్భుతమైన రాష్ర్టాన్ని తయారు చేసుకొన్నం. తెలంగాణకు గుండెకాయ వంటి నూతన సచివాలయాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. సుదీర్ఘపోరాటం తర్వాత తెలంగాణ ఏర్పడింది. అంతకుముందు సమైక్య పాలనలో తెలంగాణలో చాలా విధ్వంసం జరిగింది. ప్రజలు అనేక బాధలకు గురయ్యారు. కానే కావు, రానే రావు, మీకు నీళ్లెట్ల వస్తయి? సాధ్యమే కాదు.. తెలంగాణ వెనుకబడిన ప్రాం తం అంటూ పాలకులు చెప్పడమూ చూసినం. వాటన్నింటినీ దాటుకుని వచ్చింది తెలంగాణ.
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే ఫైల్పై సంతకం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ప్రత్యేక కార్యదర్శి పీ రాజశేఖర్రెడ్డి, కార్యదర్శి భూపాల్రెడ్డి తదితరులు
సమాన హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చిన సమతామూర్తి అంబేద్కర్. బోధించు, సమీకరించు, పోరాడు అనే సందేశాన్ని ఇచ్చిన విశ్వమానవుడు ఆయన. బాబాసాహెబ్ చూపిన మార్గంలో శాంతియుత పోరాటం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకొన్నాం. తర్వాత కూడా అంబేద్కర్ చూపిన బాటలోనే మన ప్రయాణం కొనసాగుతున్నది. వారు చూపిన సమతా సిద్ధాంతమే మనకు ఆచరణ యోగ్యం. అన్ని వర్గాల ప్రజల ముఖంలో చిరునవ్వు రావాలనే అంబేద్కర్ స్ఫూర్తిని అందుకున్నం కాబట్టి.. ఇటీవలే వారి జయంతి సందర్భంగా ఆకాశమంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణే కాదు, భారత జాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేసేలా ప్రతిష్టించుకున్నాం. యావత్తు భారతావనికి ఇది ఒక సందేశం. భవిష్యత్తులోనూ బాబాసాహెబ్ అడుగుజాడల్లో తెలంగాణ ప్రగతి బాటలు వేసుకుంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
ఆదివారం నూతన సచివాలయం ప్రధాన ద్వారం వద్ద రిబ్బన్ కట్ చేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు. చిత్రంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఆర్ అండ్ బీ శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, ఈఎన్సీ గణపతిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్రావు తదితరులు
తెలంగాణ అవతరించిన కొత్తలో, తెలంగాణ అవతరణకు ముందు చాలా వాదోపవాదాలు, చర్చలు చూశాం. తెలంగాణ అవతరించిన తర్వాత కూడా పునర్నిర్మాణం కోసం మనం అంకితభావంతో అడుగులు వేసే సందర్భంలో కొందరు అర్భకులు కారుకూతలు కూశారు. తెలంగాణ భావాన్ని, అర్థాన్ని, పునర్నిర్మాణ కాంక్షను జీర్ణించుకోలేని పిచ్చివాళ్లు ఏవేవో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం అంటే ఏంది? ఉన్నవన్నీ కూలగొట్టి మళ్లా కడుతరా? మొత్తం తెలంగాణనే కూలగొట్టి మళ్ల కడుతరా? అని కొందరు కురచ వ్యక్తులు, మరుగుజ్జులు చిల్లర వ్యాఖ్యలు చేశారు. వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లి ఈ రోజు ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయింది నా తెలంగాణ రాష్ట్రం. పునర్నిర్మాణం అంటే ఏమిటో తెలియని మరుగుజ్జులకు నాలుగు మాటలు ఈ సందర్భంగా చెప్పదలచుకున్నా.
నాడు సమైక్యపాలనలో చిక్కిశల్యమైపోయి, శిథిలమైపోయిన కాకతీయుల నాటి గొలుసుకట్టు చెరువులను
పునరుద్ధరించి, ఎండాకాలంలో కూడా మత్తడి దుంకేలా నిర్మించాం. పునర్నిర్మాణానికి భాష్యం అదే.
అనేక నదులు, ఉపనదులు తెలంగాణలో ఉన్నాయి. ఉద్యమం సందర్భంగా నేను తిరిగేటప్పుడు ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల మధ్య గోదావరి నదిని ఎప్పుడు దాటినా.. నదిలో చిల్లర డబ్బులు వేసి, రెండు చేతులు జోడించి దండం పెట్టేవాణ్ణి. ‘తల్లీ గోదావరి.. మా భూమి మీదకు ఎప్పుడొస్తవ్.. మా పొలాలు ఎప్పుడు పండిస్తవ్?’ అని ఎంతో ఆశతో దండం పెట్టేవా ణ్ణి. దుస్థితి ఏదంటే ఆనాటి సమైక్య రాష్ట్రంలో గోదావరిలో డబ్బులేద్దాం, పైసలేద్దాం, రాగి నాణెం వేద్దామంటే నీళ్లు ఎక్కడున్నవో వెతుక్కొని చిన్నపాటి గుంతలో నీళ్లు దొరికితే రామగుండం దగ్గర ఆ గోదావరిలో రూపాయి బిళ్లలు వేసేవాళ్లం. ఈ రోజు రామగుండం పోతే తెలంగాణ ఇంజినీర్లు సృష్టించిన అద్భుతం కనిపిస్తుంది. ఇంజినీరింగ్ మార్వెల్ ఇన్ ది వరల్డ్.. ది వరల్డ్ లార్జెస్ట్ మల్టీ పర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రజత్కుమార్ ఆధ్వర్యంలో, వారి ఇంజినీరింగ్ బృందం ఆధ్వర్యంలో ఈ రోజు శిఖరాయమానంగా ప్రపంచానికే తలమానికంగా వెలిగింది మన కాళేశ్వరం. ఇదీ పునర్నిర్మాణం అంటే.
వాగుల మీద నిర్మించిన చెక్డ్యామ్లు గోదావరిలో కావొచ్చు, కృష్ణలో కావొచ్చు, మంజీర, మానేరు, హల్దీ, కూడవెల్లి వగైరా ఉపనదుల మీద నిర్మించిన చెక్డ్యామ్లు.. ఏప్రిల్, మే నెలల్లో కూడా మత్తళ్లు దుంకటమే పునర్నిర్మాణం. కండ్లుండి చూడలేని కబోధులకు చెప్తున్నా.. పునర్నిర్మాణానికి భాష్యం ఇదే.
ఆనాడు నెర్రెలుబాసి, నోళ్లు వెల్లబెట్టి, బీళ్లుగా మారిపోయిన లక్షల ఎకరాల తెలంగాణ భూములు.. నేడు నిండు నీటిపారుదలకు నోచుకొని వెదజల్లుతున్న హరిత కాంతి ప్రభలే తెలంగాణ పునర్నిర్మాణం. ఈ రోజు యాసంగి పంటలో మొత్తం భారతదేశంలో ఉన్న వరిపైరు 94 లక్షల ఎకరాలు అయితే, అందులో 56 లక్షల ఎకరాలు ఒక్క తెలంగాణలోనే పండుతున్నదని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. ఆ పొలల్లో కనిపిస్తున్న హరిత కాంతే తెలంగాణ పునర్నిర్మాణం.
ఒక కాళేశ్వరం, ఒక పాలమూరు ఎత్తిపోతల, ఒక సీతారామ ప్రాజెక్టు ఇలా ఎన్నో. అర్ధరాత్రి కరెంట్ పోయి, ఎప్పుడు వస్తదో తెలియక పారిశ్రామికవేత్తల ధర్నాలు, ప్రజల గగ్గోలు, జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లతో ఉన్న రాష్ట్రంలో ఇవాళ అవన్నీ మాయమైపోయినయ్. అద్భుతమైన కాంతులతో వెలుగు జిలుగులతో తెలంగాణ విరాజిల్లుతున్నది. ఒకప్పుడు.. అర్ధరాత్రి బాయిలకాడ కరెంట్ మోటర్లు వేయడానికి కరెంట్ షాకులతో చచ్చిపోయిన రైతులను చూశాం. పాములు, తేళ్లు కుట్టి చచ్చిపోయిన రైతులను చూశాం. ఇప్పుడు పగటి పూటనే సాయంత్రం 6 గంటల వరకే తమ పొలాలకు నీళ్లు పారించుకుని దర్జాగా ఇంటికి వచ్చి కంటినిండా నిద్రపోతున్న రైతుల దర్పం చూస్తున్నాం. ఇదీ పునర్నిర్మాణం అంటే..
నూతన సచివాలయాన్ని ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రి వేముల, సీఎస్ శాంతికుమారి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్రావు, ఈఎన్సీ గణపతిరెడ్డి, వీ శేషాద్రి, ఆర్కిటెక్ట్ అస్కర్ కోని తదితరులు
ఒకప్పుడు ఫ్లోరైడ్ రక్కసి దాహానికి ఎంతో మంది బలైపోయేవాళ్లు. గుక్కెడు నీటికోసం అల్లాడి, ఫ్లోరైడ్తో నడుం వంగి లక్షల మంది బిడ్డలు జీవితాలను కోల్పోయేవాళ్లు. ఇవాళ మిషన్ భగీరథ వారందరి జీవితాలను మార్చేసింది. భగీరథుడే స్వయంగా దిగివచ్చి వాళ్ల కష్టాలన్నీ తీర్చేసినట్టు ప్రతి ఇంట్లో స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఏ నీళ్లు ఉంటాయో, ఆదిలాబాద్ జిల్లాలోని గోండు గూడెంలోనూ అవే నీళ్లు అందుతున్నాయి. నలువైపులా సూపర్ స్పెషాలిటీ దవాఖానలు, తెలంగాణ వరంగల్ హెల్త్ యూనివర్సిటీ.. ఇవీ అద్భుతమైన పునర్నిర్మాణ ప్రతీకలు.
క్షీణించిపోయి, ఆగమైపోయిన అడువులు నా ఓఎస్డీలు భూపాల్రెడ్డి, ప్రియాంక వర్గీస్ సారథ్యంలో గత పీసీసీఎఫ్ (అటవీ సంరక్షణ ప్రధాన అధికారి) శోభ, ప్రస్తుత పీసీసీఎఫ్ డోబ్రియల్ నేతృత్వంలో అటవీ శాఖ అధికారుల పట్టుదల, కృషితో కొత్త శోభను సంతరించుకున్నాయి. తెలంగాణ అడవులు దేశానికే ఆదర్శంగా హరత శోభను వెదజల్లుతున్నాయి. కోల్పోయిన అడవులను తిరిగి తెచ్చుకోవడమే తెలంగాణ పునర్నిర్మాణం అని ఆ మరుగుజ్జులకు తెలిజేస్తున్నాను. ఒకప్పుడు పాలమూరు అంటే వలసపోయిన కూలీలకు చిరునామా. పాలమూరు వలస కూలీలందరూ ఇప్పుడు తిరిగొచ్చేశారు. సొంత పొలాల్లోకి దిగి పనిచేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఆదివారం నూతన సచివాలయంలోని ముఖ్యమంత్రి చాంబర్లో పూజా కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్
తెలంగాణ ఒక సమ్మిళిత అభివృద్ధితో రైతాంగాన్ని, సంక్షేమాన్నే కాకుండా పారిశ్రామిక విధానంలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. ఐటీ రంగంలో జయేశ్ రంజన్ సారథ్యంలో బెంగళూరును కూడా దాటే స్థాయికి ఎదిగి తారాజువ్వలా దూసుకెళ్తున్నది. అంతర్జాతీయ నగరాలకు దీటుగా హైదరాబాద్ రూపుదిద్దుకొంటున్నది. నగరంలో ఎన్నో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లు నిర్మించాం. ఎన్నో సౌకర్యాలు తీసుకొచ్చాం. ఇదే పునర్నిర్మాణం అంటే.
తెలంగాణ ఏర్పడిన తర్వాత శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయి. తెలంగాణ గత డీజీపీలు అనురాగ్ శర్మ, మహేందర్రెడ్డితోపాటు ప్రస్తుత డీజీపీ అంజనీకుమార్ ఆధ్వర్యంలో గత పదేండ్లుగా ఒక చిన్న మత కల్లోలం లేకుండా, మహిళలకుభరోసానిస్తూ స్వాతిలక్రా సారథ్యంలో షీటీమ్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయి. అరాచక మూకల పీచమణుస్తున్నారు. తెలంగాణ పోలీసులు దేశానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. ఆ పోలీసుల కృషే తెలంగాణ పునర్నిర్మాణం.
యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామి ఆలయం భూలోక వైకుంఠంగా వెలుగొందుతున్నది. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నది. రెండు చేతులతో యాదాద్రి శిఖరం నుంచి తెలంగాణ యావత్ ప్రజలను దీవిస్తున్న లక్ష్మీనారసింహ స్వామి ఆలయం తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీక.
ఒకపుడు మురికి కూపాలుగా ఉన్న పల్లెలు, పట్టణాలు ఈరోజు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. గ్రామాలు, పట్టణాలు ఎంత అద్భుతంగా అలరారుతున్నాయో, ఎన్ని అవార్డులు మన గ్రామాలు సొంతం చేసుకొంటున్నాయో అందరూ చూశారు. డివైడర్లతో, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లతో, పరిశుభ్రతతో, పచ్చదనంతో, డంపింగ్ యార్డులతో, వైకుంఠధామాలతో తెలంగాణ వెలుగులీనున్నది. అదే పునర్నిర్మాణం అంటే.
ప్రపంచంలో అభివృద్ధిని, పునర్నిర్మాణాన్ని కొలమానంగా తీసుకొనే సూచికలు రెండు. ఒకటి తలసరి ఆదాయం. రెండోది తలసరి విద్యుత్తు వినియోగం. ఇవి రెండు నిజమైన అభివృద్ధి సంకేతాలు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మనం ఎన్నింటిలోనో ముందువరుసలో ఉన్నాం. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న రామకృష్ణారావు ఆధ్వర్యంలో అద్భుత ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ మిగులు రాష్ట్రంగా వెలుగొందుతూ, పతకా స్థాయికి చేరాం. రూ.3.17 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే నంబర్ వన్ స్థాయిగి ఎదిగాం. ఒకప్పుడు తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం 1,100 యూనిట్లు మాత్రమే. ఇప్పుడు 2,140 యూనిట్లతో భారతదేశంలోనే అగ్రభాగాన ఉన్నది. ఇది తెలంగాణ పునర్నిర్మాణం అంటే.
ఒకప్పుడు ఆసరా పెన్షన్ అంటే పెద్ద ప్రయాస. ఒకవేళ వచ్చినా ఆఫీసుకు, ఇంటికి చార్జీలకే సరిపోయేది కాదు. అప్పట్లో.. ఆసరా పెన్షన్ కోసం పడిగాపులు కాసి, నిరాధరణకు గురైన వృద్ధులు, ఒంటరి మహిళలు, ఎందరో. ఇప్పుడు వాళ్లందరూ అద్భుతంగా రూ.2,016 అందుకొంటూ గ్రామాల్లో చిరునవ్వుతో సంతోషంగా గడుపున్నారు. పల్లెల్లో ఆ చిరునవ్వులే.. వెలిగిపోతున్న ముఖాలే.. వెలుగు దివ్వెలే.. తెలంగాణ పునర్నిర్మాణానికి నిదర్శనం. అల్పులారా, మరుగుజ్జులారా… జాగ్రత్త ఇప్పటికైనా మీ కుళ్లును పక్కన పెట్టండి అని సీఎం కేసీఆర్ హితవు పలికారు.
తెలంగాణ వచ్చిన తర్వాత నినాదాలకే పరిమితం కాలేదు. అవన్నీ ఆచరణలో పెట్టాం. పరిపాలన సంస్కరణలతో ఆచరణాత్మక విధానంలో 33 జిల్లాలతో అలరారుతూ అద్భుతమైన పరిపాలన అందిస్తున్న తెలంగాణలోని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీల సారథ్యంలో వెలుగుతున్న ప్రభలే తెలంగాణ పునర్నిర్మాణం. 33 జిల్లాల్లో 33 జిల్లా కలెక్టరేట్లు, 33 జిల్లా పోలీస్ కార్యాలయాల నుంచి వెలుగులీనుతున్న కాంతులే తెలంగాణ పునర్నిర్మాణం. యస్.. కూలగొట్టి కట్టినం. కొన్నిచోట్ల కొత్తగా కట్టినం. అవసరం ఉన్నచోట ఉన్నవి కూలగొట్టి పునర్నిర్మాణం చేసినం. వరంగల్ కలెక్టరేట్ గందరగోళంగా ఉండేది. అందులే కూలగొట్టి కట్టినం. ఆనాటి కలెక్టరేట్, ఇప్పటి కలెక్టరేట్ను చూస్తే తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంటో ఈ మరుగుజ్జులకు తెలిసి వస్తది.
తెలంగాణ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన సచివాలయం అద్భుతంగా రూపుదిద్దుకున్నది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన భవన శిల్పి అస్కర్ కోని అర్కిటెక్ట్కు, నిర్మాణ సంస్థ షాపూర్ జీ పల్లోంజికి, వీరందరికి నాయకత్వం వహించి ముందుకు నడిపిన ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ శశిధర్రెడ్డి, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ లింగారెడ్డి, స్ట్రక్చరల్ ఇంజినీర్ శ్రీధర్రెడ్డిలకు తెలంగాణ ప్రజల తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వీరందరినీ మించి ఈ నిర్మాణంలో తమ చెమట చుక్కల్ని ఒడిపిన వివిధ రాష్ర్టాలకు చెందిన ప్రతి కార్మికునికి తెలంగాణ ప్రజల తరుపున ధన్యవాదాలు. మీ శ్రమను వృథా పోనివ్వం.ఈ అద్భుతమైన సౌధాన్ని రూపకల్పన చేయడానికి అహోరాత్రులు శ్రమించిన నా తమ్ముడు, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఏ స్ఫూర్తితో అయితే తెలంగాణ సాధించుకున్నామో అదే స్ఫూర్తితో పాలనలో ముందుకెళ్తున్నాం. రాష్ట్ర పాలనలో అద్భుతాలు సృష్టించాం. ఈ అద్భుతాల జాబితా చాంతాడంత ఉంటుంది. ధరణి పోర్టల్ వంటి ఎన్నో అద్భుత కార్యక్రమాలకు ఆలవాలంగా, ఆదర్శప్రాయంగా ఈ తెలంగాణ రూపుదిద్దుకోవడంలో కృషి చేసిన ప్రతి ఒక్క అధికారికి, ప్రతి మంత్రికి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు హృదయపూర్వక ధన్యవాదాలు. సచివాలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన నాటి సీఎస్ సోమేశ్ కుమార్కు ధన్యవాదాలు. ‘అందరం ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా, పాలసీలకు అనుగుణంగా పనిచేస్తూ ఈ రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తోడుగా ఉంటాం’ అని ఉద్యోగులందరి తరఫున చెప్పిన పరిపాలనా విభాగం అధిపతి (సీఎస్) శాంతి కుమారికి ధన్యవాదాలు అని సీఎం పేర్కొన్నారు.
ఆదివారం నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు. చిత్రంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ తదితరులు