మహబూబాబాద్: సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రమైన మానుకోటలో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన పూజల్లో పాల్గొన్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ కవితను కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు శంకర్నాయక్, రాజయ్య, పలువురు ప్రజాప్రతినిథులు పాల్గొన్నారు.
అనంతరం జిల్లా కలెక్టరేట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. తర్వాత జిల్లా అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిథులతో సమీక్ష నిర్వహిస్తారు. అంతకుముందు మహబూబాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు.