యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాదాద్రిలో లక్ష్మీనరసింహుడి ఆలయానికి అనుబంధంగా ఉన్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయ పునఃప్రారంభం సందర్భంగా చేపట్టిన మహాకుంభాభిషేక మహోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. సోమవారం యాదాద్రికి వచ్చిన సీఎం కేసీఆర్ దంపతులకు వేద పండితులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రోడ్డు మార్గంలో కొండపైకి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి తొలుత ప్రధానాలయంలోకి వెళ్లారు. ధ్వజ స్తంభానికి పూజలు చేశాక నేరుగా గర్భాలయంలోకి వెళ్లి స్వయంభువులను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ముఖ మండపంలో వారికి ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థిఘల్ లక్ష్మీనర్సింహాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు మహావేద ఆశీర్వచనం ఇచ్చారు.
అర్చకులు తీర్థప్రసాదం అందజేశారు. ఆ తర్వాత క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పూజలు చేశారు. శివాలయంలోని యాగశాలలో నిర్వహించిన మహాపూర్ణాహుతి, మహా కుంభాభిషేకం కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులను శ్రీరాంపురం (తొగుట) పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి నేతృత్వంలో ఆలయ మర్యాదలతో సత్కరించారు.
శివాలయంలోకి విచ్చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, శివాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠించిన స్ఫటిక లింగేశ్వరస్వామికి గోత్ర నామ ఉచ్చారణ, పంచామృతాలు, ఫలరసాలు, నారికేళజలంతో పూజా ఉపచారాలు సంతృప్తిగా చేపట్టారు. శివాలయ అంతరాలయంలో శివలింగానికి శివపంచాయత దేవతలందరికీ పూజావిధానంతో అభిషేక పర్వాలు జరిపారు. ఈ సందర్భంగా శివాలయ పురోహితులు, అర్చకులు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులకు దేవస్థానం తరఫున నూతన వస్ర్తాలను సమర్పించారు.
యాదాద్రిలో మూడు గంటలపాటు సీఎం..
రోడ్డు మార్గాన వచ్చిన సీఎం కేసీఆర్ యాదాద్రిలో 3 గంటలపాటు గడిపారు. ఎర్రవల్లి నుంచి బయల్దేరిన సీఎం కాన్వాయ్ ఉదయం 11:50 గంటలకు యాదాద్రికి చేరుకున్నది. 12:07 గంటలకు ప్రెసిడెన్షియల్ సూట్కు చేరుకున్న ముఖ్యమంత్రి.. సంప్రదాయ దుస్తులను ధరించి కొండపైకి బయల్దేరారు. మధ్యాహ్నం 12:18 గంటలకు ప్రధానాలయంలోకి వెళ్లిన సీఎం కేసీఆర్ దంపతులు గర్భాలయంలో పది నిమిషాల పాటు పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం 12:40కి ప్రధానాలయం నుంచి బయటకు వచ్చిన సీఎం 12:46 గంటలకు శివాలయంలోకి అడుగుపెట్టారు. పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామికి పూజలు నిర్వహించాక 1:03కు స్ఫటిక లింగానికి సీఎం దంపతులు అభిషేకం నిర్వహించారు. కాల స్వరూపుడైన మహేశ్వరుడికి పంచామృతంతో సుగంధ ద్రవ్య, పరిమళ ద్రవ్య తీర్థరాజములతో అపూర్వ వేడుకగా అభిషేకం నిర్వహించారు. 1:12 గంటలకు యాగశాలలో పూర్ణాహుతిలో పాల్గొని అక్కడి నుంచి ప్రెసిడెన్షియల్ సూట్కు వెళ్లారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. సాయంత్రం 3:10 గంటలకు హైదరాబాద్కు బయల్దేరి వెళ్లారు.
సీఎం కేసీఆర్ ధార్మికవేత్త
ముఖ్యమంత్రి కేసీఆర్ ధార్మిక, ఆధ్యాత్మికవేత్త. సీఎం కేసీఆర్కు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. మనకేం కావాలో ఆయనకు తెలుసు. కేసీఆర్ ఇప్పటికే ఎన్నో చేశారు. ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలి. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను ఉద్ధరించాలి.
– శ్రీరాంపురం (తొగుట) పీఠాధిపతి మాధవానంద సరస్వతిస్వామి
స్థపతికి స్వర్ణకంకణం
యాదాద్రి పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరాలయ పునర్నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించిన శివాలయ స్థపతి బాలసుబ్రమణ్యంకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వర్ణకంకణ ధారణ గావించి సన్మానించారు. మహాద్భుతంగా శివాలయాన్ని తీర్చిదిద్దడంలో స్థపతి పాత్రను కొనియాడారు.