హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులకు అత్యధిక పింఛన్ అందిస్తున్న రాష్ర్టాల్లో ఇప్పటికే తెలంగాణది దేశంలోనే మొదటి స్థానం. దివ్యాంగుల పింఛన్ను మరో రూ.వెయ్యి పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగుల పింఛన్ను తొలుత రూ.500 నుంచి 1,500 కు, రెండోసారి అధికారం చేపట్టిన తరువాత రూ.3,116కు పెంచా రు. తాజాగా వచ్చే నెల నుంచి రూ.4,116 చొప్పున అందివ్వాలని నిర్ణయించారు. తాజా నిర్ణయంతో ప్రతి నెలా రూ.51.68 కోట్లు అదనంగా వెచ్చించాల్సి ఉంటుంది. గడచిన తొమ్మిదేండ్లలో ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ కోసం రూ.10,310.36 కోట్లకుపైగా వెచ్చించింది.
దేశంలోనే అగ్రస్థానం
దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నది. అనేక రాష్ర్టాలు వైకల్య శాతాన్ని బట్టి దివ్యాంగులకు పింఛన్ అందజేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 80% పైబడిన వైకల్యం ఉన్న వారికి రూ.300 పింఛన్ అందజేస్తున్నది. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో రూ.48 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.60 వేల వార్షిక ఆదాయం మించని వారికి మాత్రమే ఇస్తున్నది. 18 ఏండ్ల నుంచి 79 ఏండ్ల వయస్సున్నవారికే ఇవ్వాలన్నది కేంద్రం నిబంధన. చాలా రాష్ర్టాలు కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అమలు చేస్తుండగా, కొన్ని రాష్ర్టాలు కేంద్రం వాటాకు అదనంగా మరికొంత కలిపి అందజేస్తున్నాయి. కానీ, తెలంగాణ ప్రభుత్వం 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ను అందిస్తున్నది. వార్షిక ఆదాయ పరిమితిని కూడా దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని రీతిలో గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు పెంచింది.
మానవీయతకు నిదర్శనం
దివ్యాంగులకు పింఛన్ల పెంపు నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ మానవీయతకు నిలువెత్తు నిదర్శనం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్న సీఎం కేసీఆర్.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో దివ్యాంగుల పింఛన్ను మరో రూ.వెయ్యి పెంచడం ఆనందంగా ఉన్నది. ఈ నిర్ణయం దివ్యాంగులకు ఎంతో ఆర్థిక భరోసాను కల్పిస్తుంది.
– కొప్పుల ఈశ్వర్, ఎస్సీ సంక్షేమ, దివ్యాంగులశాఖ మంత్రి
దివ్యాంగులకు స్వర్ణయుగం
దివ్యాంగుల పెన్షన్ను మరో వెయ్యి పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడం ఆనందంగా ఉన్నది. దివ్యాంగుల తరపున సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. కేసీఆర్ పాలన దివ్యాంగులకు స్వర్ణయుగం. ఆసరా పెన్షన్లతో దివ్యాంగులకు ఒక భరోసాను కల్పించారు. ఆత్మవిశ్వాసం నింపారు. దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా ప్రభుత్వం దివ్యాంగులకు అనేక సహాయ ఉపకరణాలు అందిస్తూ బాసటగా నిలుస్తున్నది.
–వాసుదేవరెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్
దివ్యాంగులకు వివిధ రాష్ర్టాలు అందిస్తున్న పింఛన్