CM KCR | జగిత్యాల, మే 7(నమస్తే తెలంగాణ): దేవుడు కరుణించకపోయినా.. ఆ రెండు కుటుంబాలను అక్కున చేర్చుకున్నారు సీఎం కేసీఆర్. తొమ్మిదేండ్లుగా ఆ కుటుంబాలకు దైవసన్నిధి అయ్యారు. విధి ఆడిన వింత నాటకంలో జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాపూర్ పంచాయతీ పరిధిలోని కొత్తపల్లికి చెందిన రెండు కుటుంబాల్లోని వారంతా దివ్యాంగులే. నిరుపేద కుటుంబాలకు చెందిన వారు సాయం కోసం కొన్ని ఏండ్లుగా ఎదురుచూశారు. అన్నమో రామచంద్రా అంటూ అంగలార్చారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి, సీఎం పాలనా పగ్గాలు చేపట్టగానే.. దివ్యాంగుల నెల పింఛన్ పెంచడంతో ఆ రెండు కుటుంబాలకు ఆసరా దొరికింది. కేవలం ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయంతోనే ఆ రెండు కుటుంబాలు మనుగడ సాగిస్తున్నాయి.
మల్యాల మండలం సర్వాపూర్ అనుబంధ గ్రామమైన కొత్తపల్లికి చెందిన కానిగంటి లచ్చ-లక్ష్మి దంపతుల కొడుకు లచ్చయ్య. ఇతను పుట్టుకతోనే దివ్యాంగుడు. దొడ్డికాళ్లతో పుట్టిన లచ్చయ్య చిన్నతనంలోనే పోలియోబారిన పడటంతో ఎడమ చేయి దాదాపు చచ్చుబడిపోయింది. ఓవైపు దొడ్డికాళ్లు, మరో వైపు ఎడమ చేతికి పోలియోతో చాలా ఇబ్బందులు పడ్డాడు. లచ్చయ్య మేజర్ కాగానే అతని తల్లిదండ్రులు.. మానసిక దివ్యాంగురాలితో పెండ్లి చేశారు. వీరికి ముగ్గురు కొడుకులు. దురదృష్టవశాత్తు ముగ్గురు కొడుకులు దివ్యాంగులే. 30 ఏండ్ల వయసున్న లచ్చయ్య పెద్ద కొడుకు గంగారాజం మానసికస్థితి సరిగాలేక ఇబ్బంది పడుతున్నాడు. రెండో కొడుకైన గంగమల్లు (27)కు సైతం మానసికస్థితి సరిగా లేదు. మూడో వాడైన మహేశ్ (24) పుట్టుకతోనే మూగ, చెవిటి. పది గుంటల వ్యవసాయ భూమి ఉండగా కౌలుకు ఇచ్చింది. ముగ్గురు దివ్యాంగులే కావడంతో వారి కుటుంబం రోజు గడవని దుస్థితి.
తెలంగాణ ఆవిర్భావం వరకు లచ్చయ్య-లక్ష్మి దంపతులు, వారి సంతానం అష్టకష్టాలు పడ్డారు. కుటుంబంలో నలుగురికి (లక్ష్మికి మినహా) సదరం ధ్రువీకరణ పత్రాలు ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి పెద్దగా సాయం లేకపోవడంతో వారి వేదన అరణ్యరోదనే అయ్యింది. తెలంగాణ అవతరించడం, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఉద్యమ నేత కేసీఆర్ పెద్ద మనుసుతో ఆసరా పెన్షన్ మొత్తాన్ని పెంచడంతోపాటు ఇంట్లో ఎంత మంది దివ్యాంగులు ఉంటే అంతమందికి పెన్షన్ మంజూరు చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో లచ్చయ్య-లక్ష్మి కుటుంబ సమస్య తీరిపోయింది. ఇంట్లో నలుగురికి సదరం ధ్రువీకరణ పత్రాలు ఉండటంతో తండ్రి, ముగ్గురు కొడుకులకు పెన్షన్లు మంజూరయ్యాయి.
రాష్ట్రం ఏర్పడిన మొదట్లో కుటుంబంలోని నలుగురికి కలిపి నెలకు రూ.6,064 పెన్షన్ అందడంతో ఆ కుటుంబ దినసరి ఖర్చులకు ఇబ్బంది లేకుండాపోయింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ దివ్యాంగ పెన్షన్ను నెలకు రూ.3,016కు పెంచారు. దీంతో లచ్చయ్య కుటుంబం నెలకు రూ.12,064 సాయాన్ని పొందుతున్నది. ఏటా రూ.1,44,768 సాయం ఒక్క లచ్చయ్య కుటుంబం పొందుతుండటం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్తో ఎవరి సాయం అవసరం లేకుండా ఆ కుటుంబం జీవనాన్ని సాగిస్తున్నది.ప్రభుత్వం నెలనెలా అందజేస్తున్న సాయంపై లచ్చన్నను కదిలించగా, ఆ దేవుడు తనను తన పిల్లలను చిన్నచూపు చూసినా, సీఎం కేసీఆర్ తమపై పెద్దమనసు చూపారని, ఆయన దయతో, ఐదుగురం రోజూ రెండుపూటలా అన్నం తిని బతుకుతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి కేచంద్రశేఖర్రావుకు తమ కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుందని తెలిపాడు.
ఇదే గ్రామానికి చెందిన తూడి మల్లయ్య-ఎల్లవ్వ దంపతులకు గంగాధర్, గంగమణి సంతానం. ఇద్దరూ పుట్టుకతోనే మూగ, చెవిటి. ఎన్ని దవాఖానల్లో చూపించినా జన్యులోపంతో వచ్చాయని, వాటిని సరిచేయలేమని వైద్యులు తేల్చిచెప్పారు. గంగమణికి ఒక కన్ను పూర్తిగా కనిపించదు. ఇద్దరు బిడ్డలు దివ్యాంగులే కావడంతో ఆ దంపతులు మనస్తాపంతో అనారోగ్యం పాలయ్యారు. ఎల్లవ్వ 20 ఏండ్ల క్రితం, మల్లయ్య 2015లో మృతిచెందారు. పిల్లలు అనాథలు మిగిలారు. ఓవైపు వైకల్యం, మరోవైపు పేదరికం పూర్తిగా కుంగదీసింది. తాము పడుతున్న వేదన, ఆకలిబాధను సైతం చెప్పలేని దీనస్థితి. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం రావడం, గంగాధర్, గంగమణి ఇద్దరికి సదరం క్యాంపులో ధ్రువీకరణ పత్రం అందడంతో దివ్యాంగ పెన్షన్ మంజూరైంది. తొమ్మిదేండ్లుగా అన్నాచెల్లెలు ప్రభుత్వ సాయంతో నెట్టుకొస్తున్నారు. గతేడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు వీరి ఇల్లు కూలిపోగా, బంధువులు రేకులషెడ్డు నిర్మించి ఇచ్చారు. తమకు అండగా నిలిచిన కేసీఆర్ దేవుడంటూ సైగలతో చెప్తున్నారు.