రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ గురువారం బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పణతో నేటి నుంచి తెలంగాణలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయన్నారు. ప్రతి ఏటా ఆషాఢం, శ్రావణ మాసాల్లో రాష్ట్రవ్యాప్తంగా జరుపుకునే బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
తెలంగాణ సబ్బండ వర్గాల సాంప్రదాయాలకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవాన్నిస్తున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక సంస్కృతిని చాటే బోనాల పండుగ తెలంగాణ జీవన వైవిధ్యానికి, పర్యావరణ, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు అందించాలని అమ్మవారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రార్థించారు.