హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని పురసరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎవని భాషను వాడు రాయాలె.. మాట్లాడాలె’ అనే కాళోజీ మాతృభాష స్ఫూర్తి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిందని సీఎం అన్నారు. తెలంగాణ సాహిత్యానికి కాళోజీ అస్తిత్వ సృ్పహను అందించారని పేర్కొన్నారు. వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ అమ్మ భాషకు సాహితీ గౌరవాన్ని మరింతగా పెంచేందుకు తెలంగాణ సాహితీవేత్తలు కృషిని కొనసాగించాలని సూచించారు. తెలంగాణ భాషా సాహిత్య రంగాల్లో కృషిచేస్తున్న కవులు రచయితలను గుర్తించి వారికి కాళోజీ పేరున పురసారాలను అందిస్తూ ప్రభుత్వం ఆయను గౌరవించుకొంటున్నదని అన్నారు. ‘పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది’ అన్నట్టుగా సాగిన కాళోజీ జీవితం తెలంగాణ భాషా సాహితీసేవకే అంకితమైందని చెప్పారు. ఈ ఏడాది కాళోజీ పురసారాన్ని అందుకోనున్న కవి, రచయిత శివరామకృష్ణకు సీఎం అభినందనలు తెలిపారు. గురువారం రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో శివరామకృష్ణకు కాళోజీ అవార్డు ప్రదానం చేస్తారు. అవార్డు కింద ఆయనకు రూ. 101,116 నగదు, జ్ఞాపిక బహూకరిస్తారు.
ప్రజాకవికి సర్కారు నిజమైన నివాళి
బడిపలుకుల భాష కాదు..పలుకుబడుల భాష కావాలని నినదించిన ప్రజాకవి కాళోజీ స్మృతిని రాష్ట్ర ప్రభుత్వం సముచిత రీతిలో గౌరవిస్తున్నది. కాళోజీ శతజయంతి ఉత్సవాల ముగింపు…తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించి టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టి 100 రోజులు పూర్తిచేసుకున్న అపురూప సందర్భంలో చేసిన ప్రకటనకు అనుగుణంగా సీఎం కేసీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్సైన్సెస్గా నామకరణం చేశారు. కాళోజీ పుట్టినరోజును ప్రభుత్వం తెలంగాణ అధికార భాష దినోత్సవంగా జరుపుతున్నది. ప్రభుత్వమే కాళోజీ పేరిట అవార్డు ఇస్తుందని 2015లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటివరకు కవులు, సాహితీవేత్తలు, ప్రజాకళాకారులైన అమ్మంగి వేణుగోపాల్, అంపశయ్య నవీన్, సీతారాం, డాక్టర్ కోట్ల వెంకటేశ్వర్రెడ్డి, గోరటి వెంకన్న, రామా చంద్రమౌళి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్నారు. ఈ యేడాది పెన్నా శివరామకృష్ణను కాళోజీ అవార్డుతో ప్రభుత్వం సత్కరిస్తున్నది. హన్మకొండకు గుండెకాయ వంటి ప్రాంతంలో పదెకరాల స్థలాన్ని కేటాయించి రూ.50 కోట్లతో కాళోజీ కళాకేంద్రాన్ని నిర్మిస్తున్నది.