మధిర: కాంగ్రెస్ నేతలు రైతుబంధు వేస్ట్ అంటున్నరని, 24 గంటల కరెంటు అవసరమే లేదని చెప్తున్నరని, ధరణి పోర్టల్ తీసి బంగాళాఖాతంల పడేసి దాని స్థానంల భూమాత తెస్తమంటున్నరని, ఇన్ని తల్కాయలేని మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలను నమ్మి ఓటేస్తే మోసపోతరని ముఖ్యమంత్రి కేసీఆర్ మధర ఓటర్లను హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మధిర నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే రాష్ట్రంలో గణనీయమైన అభివృద్ధి జరుగుతదని చెప్పారు.
కాంగ్రెస్ గెలిస్తే కరెంటు కాట గలుస్తది
‘కాంగ్రెస్ నాయకులు రైతుబంధు వేస్ట్, దాన్ని తీసి బంగాళాఖాతంలో పడేస్తమని అంటున్నరు. మరె రైతుబంధు వేస్టా..? రైతుబంధు కావాలె గదా..? మరె రైతుబంధు ఉండాల్నంటే ఇక్కడ కమల్రాజ్ను గెలిపించాలె. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రైతుబంధు ఉండుడే కాదు, ఎకరానికి రూ.10 వేలు ఉన్న రైతుబంధును ఎకరానికి రూ.16 వేలకు పెంచబోతున్నం. కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చి వేస్ట్ చేస్తున్నడని అంటున్నరు. మూడు గంటలే చాలు అంటున్నరు. మరె మూడు గంటల కరెంటు చాలా..? చాలదు గదా..? మరె 24 గంటల కరెంటు ఉండాలె గదా..? మరె 24 గంటల కరెంటు ఉండాల్నంటే ఏం జెయ్యాలె..? మధిరల కమల్రాజ్ను గెలిపించాలె. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే కరెంటు కాట గలుస్తది’ అని సీఎం హెచ్చరించారు.
‘కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి మేం మా రాష్ట్రంలో 5 గంటల కరెంటు ఇస్తున్నమని గొప్పగ జెప్పిండు. అరె సన్నాసి మాది 24 గంటల కరెంటు ఇచ్చే రాష్ట్రం రా.. నువ్వేం మాట్లాడుతున్నవ్ అని అడిగిన. కాంగ్రెస్ హయాంల మధిరల కరెంటు ఎట్లుండె..? చిల్లకల్లు కాడ వచ్చేది. చిల్లకల్లు కాడ వస్తే రోజూ బ్రేక్ డౌనే. దాన్ని నేనొచ్చినంక ఖమ్మానికి మార్చిన. దాంతోటి మధిరకు శాశ్వతంగ పీడపోయింది. ఇయ్యాల నాణ్యమైన కరెంటు వస్తున్నది. కాబట్టి మీరు ఆలోచన చేసి ఓటెయ్యాలె. పార్టీ వైఖరి, చరిత్రను చూడాలె. మేం అధికారంలోకి రాగానే కాంగ్రెసోళ్లు ఇస్తున్న రూ.200 పెన్షన్ను రూ.1000 చేసినం. తర్వాత రూ.2 వేలకు పెంచినం. భవిష్యత్తులో దాన్ని రూ.5 వేలకు పెంచబోతున్నం. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా మూడు కోట్ల మందికి కంటి పరీక్షలు చేసినం. 80 లక్షల మందికి అద్దాలు ఇచ్చినం. ఈ 80 లక్షల అద్దాలు మాయి ఉండంగ కాంగ్రెస్ ఎట్ల గెలుస్తదండి..?’ అని సీఎం ఓటర్లను ప్రశ్నించారు.