అధిక వానలతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆది, సోమవారాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఇందుకోసం శనివారం సాయంత్రమే సీఎం వరంగల్లోని టీఆర్ఎస్ సీనియర్ నేత కెప్టెన్ వీ లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకొన్నారు. ఆదివారం ఉదయం వరంగల్ నుంచి భద్రాచలం దాకా హెలికాప్టర్లో పర్యటించి ఏరియల్ సర్వే చేస్తారు. అనంతరం భద్రాచలంలో పర్యటించి, వరద ముంపు వల్ల సంభవించిన నష్టం, చేపడుతున్న వరద సహాయక చర్యలపై స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షిస్తారు. అకడినుంచి ఏటూరునాగారం ప్రాంతంలో ఏరియల్ సర్వే చేపట్టి, వరద సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం ఏటూరునాగారం నుంచి హైదరాబాద్ చేరుకొని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాల ఉత్సవాల్లో పాల్గొంటారు. తిరిగి సోమవారం ఉత్తర తెలంగాణలోని ఎస్సారెస్పీ, కడెం, కాళేశ్వరంప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టి, వరద బాధితులను పరామర్శించి, వారికి భరోసా ఇవ్వనున్నారు.
సీఎం కేసీఆర్ వరంగల్కు రాగానే వరద ప్రాంతాల్లో ఆదివారం నిర్వహించే ఏరియల్ సర్వేపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో సమావేశమయ్యారు. గోదావరి, దాని ఉపనదుల వరద ప్రవాహం, కాంటూర్ లెవల్స్ వివరాలను అడిగి తెలుసుకొన్నారు. కాళేశ్వరం నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలో ఉన్న కరకట్టలు, వాటి నాణ్యత తదితర వివరాల గురించి చర్చించారు. కడెం ప్రాజెక్టు వరద సామర్థ్యం 2.95 లక్షల క్యూసెక్కులు మాత్రమేనని, కానీ, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కడెం ప్రాజెక్టుకు 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని సీఎం పేర్కొన్నారు. భవిష్యత్తులో గోదావరి తీరంలో వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా సమగ్ర సర్వే నిర్వహించి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఈ విషయంలో ఇంతకుముందు ఇరిగేషన్ శాఖలో పనిచేసి రిటైరైన ఇంజినీర్ల సలహాలు, సూచనలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అత్యవసర సహాయం కోసం కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, నిర్మల్, జిల్లాల కలెక్టర్లకు రూ.కోటి చొప్పున వెంటనే నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావును ఆదేశించారు.
ప్రజలకు అవసరమైన మందులు, ఆహారం, అందిస్తూ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఇంకా కొన్ని రోజుల పాటు గోదావరిలో వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉన్నందున అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ సంతోష్కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బండా ప్రకాశ్, తక్కళ్లపల్లి రవీందర్రావు, కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, అరూరి రమేశ్, వొడితెల సతీశ్, టీ రాజయ్య, శంకర్నాయక్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, గండ్ర వెంకటరమణరెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జడ్పీ చైర్పర్సన్లు సుధీర్కుమార్, గండ్ర జ్యోతి, కుడా చైర్మన్ ఎస్ సుందర్రాజుయాదవ్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు వాసుదేవరెడ్డి, సతీశ్రెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.