CM KCR | ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఫైర్ అయ్యారు. విశ్వగురువా..? విష గురువా? అంటూ మండిపడ్డారు. నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని బంగారిగడ్డలో టీఆర్ఎస్ నిర్వహించిన సభలో పాల్గొని, ప్రసంగించారు. దేశంలో ఏం సక్కదనం ఉందని, పైనపటారం.. లోనలొటారం.. ఢంబాచారం అంటూ విమర్శించారు. మాట్లాడితే విశ్వగురు అంటారనీ.. విశ్వ గురువా.. విషగురువా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరాచక, కిరాచక రాజకీయాలు చేస్తున్న, రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టుకుంటూ.. రాజకీయాలను అస్థిరపరుస్తూ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న దుర్మార్గమైన మతోన్మాద బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. మునుగోడు చైతన్యవంతమైన గడ్డ అనీ, ఆలోచనలేకుండా గాలికి వేయొద్దు ఓటు వేయొద్దని సూచించారు.
డాలర్తో పోల్చి చూస్తే రూపాయి.. 82 రూపాయలుగా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. నేపాల్, పాక్, బంగ్లాదేశ్ కరెన్సీ కన్నా అధ్వాన్నంగా ఉంటదా? అని ప్రశ్నించారు. ఇండియా ఆకలి రాజ్యంగా మారుతుందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎన్నో ప్రకృతి వనరులు, సంపదలు ఉన్న ఈ దేశంలో నిరుద్యోగం తాండవిస్తుందా?, రూపాయి పతనానికి బాధ్యులు ఎవరు అని నిలదీశారు సీఎం కేసీఆర్. ధరల పెరుగుదలకు కారణం ఎవరు? సిలిండర్ రూ.1200 చేసింది ఎవడు? పెట్రోల్, డీజిల్ ధరలు పెంచెంది ఎవడు? మండిపడ్డ ఆయన.. ధరలు పెంచిన బీజేపీకి మళ్లీ ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. అంత పౌరుషం లేకుండా ఉన్నమా? ఆలోచన చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అర్థమై తర్వాత కూడా.. కానట్టు చేస్తే మన బతుకులు వ్యర్థం అవుతాయని హెచ్చరించారు. సందర్భం వచ్చినప్పుడు.. నడవది మా నాటకం అని బుద్ధి చెప్పాలన్నారు. ఆ సందర్భమే మీ చేతిలో ఉన్న ఆయుధం ఓటని, ఆ ఓటును సక్రమంగా వినియోగిస్తే అలాంటి వారికి బుద్ధి వస్తుందన్నారు.