హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): దేశ చరిత్రలోనే అసమర్థ ప్రధాని నరేంద్ర మోదీ అని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఆదివారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆ అంశాలు ఆయన మాటల్లోనే..
బొగ్గు.. లక్షల కోట్ల కుంభకోణం
దేశంలో వందేండ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. రూ.4 వేలకే మన దగ్గర టన్ను బొగ్గు దొరుకుతుంది. కానీ రూ.25 వేలు, రూ.30 వేలకు టన్ను బొగ్గు కొనాలనటం కుంభకోణం కాదా? ఇది రూ.లక్షల కోట్ల కుంభకోణం. ఇవన్నీ రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో పెడతాం. ఢిల్లీలో మీ (బీజేపీ) ప్రభుత్వాన్ని గద్దె దించి వీటన్నింటిపైనా విచారణ జరిపిస్తాం. దీనిపై మోదీ ఎందుకు సమాధానం చెప్పటం లేదు? దేశ ప్రజలు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. మోదీ పాలనలో 38 శాతం పరిశ్రమలు మూతపడ్డాయి. కార్మికులు రోడ్డున పడ్డారు.
బీజేపీలో చేరగానే వాషింగ్ పౌడర్ నిర్మా
ఈ దేశంలో అప్రజాస్వామిక, అనారోగ్యకమైన వికృత రాజకీయ క్రీడ, దమననీతి కొనసాగుతున్నది. మీ వ్యాపార మిత్రులు దాదాగిరి చేసి ఇతరుల నుంచి ఎన్ని ఎయిర్ పోర్టులు గుంజుకున్నరు? ఒకాయనకు ఒక ఎయిర్పోర్ట్ ఉంటే ఆయనకు ఈడీ నోటీస్, సీబీఐ నోటీస్, ఇన్కం ట్యాక్స్ నోటీస్ ఇలా వరుసగా క్యూ కట్టి వేధించారు. ఓ 15 రోజులకు ఆయన ఇగ నా ఎయిర్పోర్టు తీసుకోండి అని చెప్పగానే తెల్లారి ఈడీ, సీబీఐ ఎవరూ ఉండరు. ఏపీ తెలుగుదేశం నాయకులకు నోటీసులు వచ్చినయ్. బీజేపీ కండువా కప్పుకోగానే ఆగిపోయినయ్. వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతది. ఇట్లా ఎంతో మందిని చేశారు. (ఈడీ నోటీసులు అందుకుని, బీజేపీలో చేరిన వారి వీడియో ఈ సందదర్భంగా ప్రదర్శించారు.
టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, పశ్చిమబెంగాల్కు చెందిన సువేందు అధికారి, బెంగాల్ ఎంపీ ముకుల్రాయ్, మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ తటు రాణే, మహారాష్ట్రకు చెందిన జ్యోతిరాదిత్య సింధియా, తెలంగాణలో ఈటల రాజేందర్పై జరిగిన సోదాలు.. ఆ తర్వాత వాళ్లు బీజేపీలో చేరుతున్న దృశ్యాలను ఆ వీడియోలో ఉన్నాయి). బీజేపీ కండువా కప్పుకోగానే 64 చెట్ల పసరు తాగినట్టు, పవిత్రం అయిపోయినట్టు చేస్తున్నరు. వ్యాపారవేత్తలను, రాజకీయ నాయకులను వేధించి, వెంటాడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? ధర్మం, న్యాయం అడిగితే జరిగేది ఇదేనా? ఈ దేశాన్ని ప్రగతి పథంలో తీసుకుపోయే తీరు ఇదేనా? బాధతో చెప్తున్నా. ఏ మూర్ఖుడూ చేయని పనులను ఈ ప్రధాని చేస్తుండు.
దేశం పరువు పోతున్నది
బీజేపీ నీచ రాజకీయాల వల్ల, వీళ్ల సంకుచిత భావాల వల్ల అంతర్జాతీయంగానూ దేశ పరువు, ప్రతిష్ఠలు తగ్గిపోతున్నాయి. మోదీ ప్రధానమంత్రి స్థాయిని దిగజార్చారు. శ్రీలంకలో భారత ప్రధానిని విమర్శిస్తూ ప్లకార్డులతో నిరసనకు దిగుతున్నారు. ప్రధాని మోదీ ఒత్తిడి వల్లే ఒక వ్యాపారవేత్తకు కాంట్రాక్ట్ ఇచ్చామని ఆ దేశ ఎలక్ట్రిసిటీ బోర్డు అధ్యక్షుడే స్టేట్మెంట్ ఇచ్చిండు. దానిపై ఇంకా మౌనంగా ఉంటారేంది మోదీ? శ్రీలంకలో ఇంకో పోర్ట్ కూడా ఈయన స్నేహితునికే ఇచ్చిండ్రు. అదెందుకు ఇచ్చారంటే ఆయనను భారత ప్రభుత్వం నామినేట్ చేసిందని అన్నారు. అలా నామినేట్ చేయొ చ్చా? చరిత్రలో ఏ ప్రధాని కూడా ఇలాంటి పొరపాటు చేయలేదు.
నెత్తుటి పీట మీద నడిచే మీకు అధికార పీఠాలు కావాలా?
నెత్తుటి పీట మీద నడిచే మీకు అధికార పీఠాలు కావాల్నా? మేము ఏడపడితే ఆడ మీటింగ్ పెట్టి ఒర్రిపోతం.. అంటే కుదరదు. ఈ దేశాన్ని నడపాల్సింది గిట్ల కాదు. తప్పకుండా మారాలి. దేశ ఆర్థిక ప్రగతికి దేశ ప్రధానే గొడ్డలిపెట్టు అవుతాడా? రాష్ర్టాలకు నిధులు ఇవ్వకుండా రాష్ట్రాల ప్రగతిని అడ్డుకుంటడా? ఇతర పార్టీల ప్రభుత్వాలను కూలగొడ్తమని చెప్పుడు గొప్ప విషయమా? దేశం మొత్తం దీన్ని తిరస్కరించాలి. నేను దేశ ప్రజలకు, యువతకు మనవి చేస్తున్నా.. బీజేపీ పాలనలో దేశం ప్రమాదంలో పడుతున్నది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిందే. క్విట్ బీజేపీ. ఈ దేశం ముందు మరో మార్గం కూడా లేదు.
మీ అసమర్థతతో మాకు నష్టం
భయంకరమైన అవినీతి.. భయంకరమైన కుంభకోణాలు.. అనారోగ్యకర, అప్రజాస్వామిక విధానాలు పాటిస్తూ ఇతరులను తిడుతున్నారు. దేశ తలసరి ఆదాయం రూ.1,49,848, తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,78,833. అంటే తెలంగాణ కన్నా దేశ తలసరి ఆదాయం రూ.1,28,985 తక్కువ. ఇంత దుర్భర స్థితిలో ఉన్న మీరు తెలంగాణకు వచ్చి తెలంగాణను నిందించి పోతరా? ఈ విషయాన్ని నేను గతంలోనే శాసనసభలో చెప్పిన. మనం ఎంత పరుగెత్తినా, ఎంత ఆరాటపడ్డా దేశంలో అసమర్థ ప్రభుత్వం ఉంటే, మనకు కూడా దుష్ఫలితాలే వస్తాయని చెప్పిన. తెలంగాణ జీఎస్డీపీ 128.3% పెరిగింది. అదే సమయంలో దేశ జీడీపీ 89.6% పెరిగింది. ఈ లెక్కలు కేంద్ర ఆర్థికశాఖనే స్వయంగా ఇచ్చింది. దేశం కన్నా తెలంగాణ ఫర్మార్మెన్స్ 38.2% ఎక్కువ. తెలంగాణ మాదిరిగా కేంద్ర ప్రభుత్వం పని చేసి ఉంటే తెలంగాణ జీఎస్డీపీ రూ.11.5 లక్షల కోట్లు కాకుండా రూ.14.5 లక్షల కోట్లు ఉండేది. కేంద్ర ప్రభుత్వ దద్దమ్మ విధానాల వల్ల, అసమర్థ విధానాల వల్ల, అవివేక పాలసీ వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే రూ.3 లక్షల కోట్లు నష్టపోయింది.
యువకుల్లారా.. ఈ దేశం మీది
బీజేపీ అరాచకాలను, దుర్మార్గాలను ఇట్లనే భరిస్తూ పోతే ఈ దేశం తప్పకుండా సర్వనాశనమైతది. ఎటు కాకుండాపోతది. చెడగొట్టడం, కూలగొట్టడం చాలా ఈజీ. పునర్నిర్మాణం చాలా కష్టం. దేశం దెబ్బతింటది. మంచిది కాదు. దయచేసి యువకుల్లారా! ఈ దేశం మీది. భవిష్యత్తు మీది. మీరు కాపాడుకోవాలి.
మోదీ ఆకాశంలకెల్లి ఊడిపడ్డడా?
మోదీ ఏమైనా ఆకాశంలకెల్లి ఊడిపడ్డడా? నాలాగే ఆయన కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండే. నా దాంట్లో ఏకాణా పని కూడా అక్కడ చెయ్యలే. గుజరాత్ మాడల్ అని డూప్లికేట్వన్నీ చూపించి, దొంగ ఫొటోలు పెట్టి గోల్మాల్ చేసి ప్రధానమంత్రి అయ్యిండు. తెలంగాణ మాడల్ దేశానికి బెస్ట్. బరాబర్ జాతీయ రాజకీయాలు చేస్తం. కేసీఆర్ ఏదన్న చేసేది సాటుకు చెప్తడా? నేను అట్ల భయపడతనా? యశ్వంత్ సిన్హా జలవిహార్ సభలో కరెక్టుగా చెప్పిండు.. మీ ముఖ్యమంత్రి 10, 20 ప్రశ్నలు అడిగిండు, ఒక్క దానికి కూడా మోదీ సమాధానం చెప్పడు అని. చెప్పకపోవడమే మీ(మోదీ) మేధావితనమా? ఈ రోజు ఈ దేశంలో జరుగుతున్నది, దేశ సంపదను వ్యాపారులకు కట్టబెట్టడం, లక్షల మంది కార్మికుల ఉసురు పోసుకోవటం, ప్రజలు, నిరుద్యోగులు, రైతులను వంచించటం మొత్తం స్విచ్చాఫ్ కావాలి. కచ్చితంగా మోదీ ప్రభుత్వాన్ని మారుస్తం. ఎల్ఐసీని అమ్మనీయం. మోదీ బ్యాడ్ పాలసీలన్నీ రివర్స్ చేస్తాం.