ఏ అధికారంతో నదుల అనుసంధానం చేస్తున్నారు
ఏ ప్రాతిపదికన అనుసంధానిస్తారు?.. మమ్మల్ని అడుగకుండా చేస్తరా?
ట్రిబ్యునల్ తీర్పును పట్టించుకోరా?.. కృష్ణా గోదావరి నీళ్లను కావేరీలో ఎట్ల కలుపుతరు?
మా ప్రతిపాదనలు ఎందుకు క్లియర్ చేయరు?
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): నదుల అనుసంధానంపై మంగళవారం నాటి బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ చేసిన ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఏ ప్రాతిపదికన అనుసంధానం చేస్తారని ప్రశ్నించారు. సీఎం మీడియాతో ప్రసంగం ఆయన మాటల్లోనే..
ఏ అధికారంతో చెప్పిన్రు..పెద్ద జోక్ అండీ ఇవాళ బడ్జెట్లో. నదుల అనుసంధానం. జోక్ ఆఫ్ ది మిలీనియం. ఇంత ఆత్మవంచన ఉంటుందా? ప్రభుత్వం సిగ్గుపడాలి. గోదావరి, కృష్ణా అనుసంధానమట? ఎట్లా చేస్తవయ్యా నాకు అర్థంకాదు.. దీనికి ప్రాతిపదిక ఏమిటి? నేరుగా అడుగుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని.. ప్రధాని మోదీని. ఏ అధికారంతో చెప్పినవ్ కృష్ణా, గోదావరి, కావేరిని అనుసంధానం చేస్తనని. గోదావరి మీద ట్రిబ్యునల్ తీర్పు ఉన్నది. ఆ తీర్పు ప్రకారం ఒక్కసారి తెలుగు రాష్ర్టాల్లోకి ఎంటర్ అయిన గోదావరిలో ప్రతి నీటి చుక్కపైన అధికారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు ఉంటదని ట్రిబ్యునల్ తీర్పు ఉన్నది. వాటర్ ట్రిబ్యునల్ తీర్పు సుప్రీంకోర్టు తీర్పుతో సమానం. ఉల్లంఘించే అధికారం ఎవ్వరికీ లేదు. మా నీళ్లను.. మమ్మల్ని అడగకుండా.. సుప్రీం తీర్పుతో సమానమైన తీర్పును పక్కకుపెట్టి కావేరినదిలో ఎలా కలుపుతవ్. ఏ చట్టం ప్రకారం కలుపుతవ్. ఇది జోక్ కాదా. ఇది తెలివితక్కువ కాదా. కలపాలంటే ఎట్ల కలపాలి? మిగులు జలాలు ఉంటే ఇతర నదులకు ఇవ్వాలి. ఉంటే కదా ఇవ్వాల్సింది. ఒకవేళ నిజమే అనుకుందాం. గోదావరిలో నీళ్లు ఉన్నాయనే అనుకుందాం. మరి తెలంగాణ ప్రతిపాదనలు దగ్గర పెట్టుకొని అనుమతులు ఎందుకు ఇస్తలేవు. నేరుగా అడుగుతున్నా. దీనికి ఏమైనా లాజిక్ ఉన్నదా? తెలంగాణ పంపిన ప్రతిపాదనలు, నేను స్వయంగా వెళ్లి లెటర్ ఇచ్చినా. ఐదు నెలలు అవుతున్నది. క్లియరెన్స్ ఇవ్వరా అండీ మాకు. నీళ్లు ఉండనే ఉండె. అంటే ఏమనుకోవాలి. దేశాన్ని ఇంత గోల్మాలా మీరు తిప్పేది.
మేం మీకు అన్ని ఇచ్చినం. డీపీఆర్లు, పీపీఆర్లు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు.. ఏమేమి కావాల్నో అన్నీ ఇచ్చినం. కావేరీలో కలుపుతడట ఈ మొగోడు. ఇంత మోసమా? ఎవర్ని గోల్ చేయడానికి, ఎవర్ని మోసంచేయడానికి. మా ఇష్టమున్న అబద్ధాలు చెప్తం, నోటికి ఏదొస్తే అది చెప్తం. ఎవర్ని పడితే వాళ్లని తిడతం అంటే ఊరుకొంటరా? నదుల అనుసంధానానికి మీ ప్రాతిపాదిక ఏమిటి? నీళ్లు ఉన్నయని చెప్తున్నవా? తెలంగాణ, ఆంధ్ర అవసరాలు తీరిపోయినయా? రేకు డబ్బాలో రాళ్లువేసి లొడలొడ ఊపినట్లు చెప్తున్నరని ఎందుకంటున్నం ఇందుకే. ఎవరి కన్సెంట్ తీసుకొన్నవ్. వారు చెప్పేయన్నీ పచ్చి అబద్ధాలు. తెలివైన దేశాలు వందలు, వేల కిలోమీటర్లు తీసుకొనిపోయి ఇస్తున్నయ్ నీళ్లు. వందల కిలోమీటర్ల దూరం, వందల మీటర్ల ఎత్తుకు తీసుకొని ఇస్తున్నం మేము నీళ్లు. కొత్త రాష్ట్రమైనప్పటికీ మీరు నిధులు ఇవ్వకున్నా, సహకారం జీరో ఉన్నా.. మేము ప్రాక్టికల్గా నీళ్లు ఇస్తున్నం. మేము పండించిన పంట కొనే మొఖం లేదు మీ తెలివికి. సిగ్గుకూడ లేదు. అంత బ్రహ్మాండంగా ఇస్తున్నం నీళ్లు.
మీ అజ్ఞానం వల్లే దేశంలో నీటి కష్టాలు
ఒక ముఖ్యమంత్రిగా నీతి ఆయోగ్ మీటింగ్లో నేను చెప్పిన. ఈ దేశంలో నీళ్ల కరువు ఉండటానికి వీలే లేదు. దేవుడు, ప్రకృతి ఇచ్చిన సంపద నీరు. దేశంలో 65 వేల టీఎంసీల నీళ్లు ఉన్నయ్. 35 వేల టీఎంసీలు మాత్రమే వాడుతున్నాం. 30 వేల టీఎంసీలు మిగులు జలాలున్నాయి. టిబెట్ నుంచి వచ్చే నీళ్ల లెక్క ఇంకా తేలాల్సి ఉన్నది. అక్కడ కూడా నాలుగైదు వేల టీఎంసీల నీళ్లు వస్తాయి. మొత్తం కలిపి 65-70 వేల టీఎంసీల నీళ్ల లభ్యత దేశంలో ఉన్నది. దేశంలో నీటి యుద్ధాలు రావడానికి మీ కురచ బుద్ధి కారణం కాదా. మీరు అమలుచేస్తున్న బ్యాడ్ వాటర్ పాలసీ కాదా కారణం. మీ అవివేకం, అజ్ఞానం కాదా? దేనికి నిదర్శనం ఇది? దేవుడిచ్చిన నీటిని వాడుకొనే తెలివిలేని మీ అజ్ఞానం కాదా? జలశక్తి మంత్రి, ప్రధాని ఏం జవాబు చెప్తారు? ఇది నిజం కాదా? సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫిగర్లే నేను చెప్తున్నా. ఇవి కేసీఆర్ ఫిగర్లు కాదు. బడ్జెట్ స్పీచ్ చూశాక ఆగ్రహంతో నేను ఈ మాటలు చెప్తున్నా. చాలా దుఃఖం కలుగుతున్నది. మేము కూడా దేశ పౌరులం. ఎన్నో సార్లు చెప్పాం. వందలసార్లు చెప్పాం. ప్రోగ్రెసివ్ స్టేట్స్ను ప్రోగ్రెస్ కానివ్వండి. అద్భుతమైన పరుగులు తీసే రాష్ర్టాల కాళ్లల్లో కర్రలు పెట్టకండి. నీళ్ల విషయంలో ఇదీ వీళ్ల పాలసీ. వీరి అనాలోచిత విధానాల వల్ల తాగునీటికోసం దేశం ఇబ్బంది పడుతున్నది.
జలశక్తి మిషన్ అంతా బోగస్….
ఇంకో పెద్ద బోగస్ ప్రకటన దేశాన్ని గోల్మాల్ చేస్తున్నది. జలశక్తి మిషన్ అట.. మిషన్ లేదు.. పాసు లేదు. అంతా బోగస్. జలశక్తి మిషన్కి పెట్టింది రూ.60 వేల కోట్లు. తెలంగాణ నాలుగు కోట్ల జనాభాకి మిషన్ భగీరథ పెడితే రూ.40 వేల కోట్లు ఖర్చయింది. 140 కోట్ల జనాభాకి రూ.60 వేల కోట్లతో జలశక్తి మిషన్ పెడతడట. అది మిషన్ అట. మేము నమ్మాలె. దేశం అడ్డంపడాలె ఇగ. దీనికి మళ్లీ మహాభారతం శాంతిపర్వంలోని శ్లోకాలు చెప్తున్నరు సిగ్గులేకుండా. ఇంత ఆత్మవంచనండీ.