సమతామూర్తికి మోదీకి సంబంధం ఏమిటి?
జీయర్స్వామి చాలా కష్టపడి ఏర్పాటు చేశారు
మోదీ కడుతున్నట్టు తప్పుడు ప్రచారమా?
బీజేపీ సోషల్మీడియా బండారం బైటపెడ్తం
నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): సోషల్ మీడియా ద్వారా బీజేపీ పచ్చి అబద్ధాలను ప్రచారంలో పెడుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. వారి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను బయటకు తెస్తామని స్పష్టంచేశారు. ఆఖరుకు ముచ్చింతల్లో చినజీయరు స్వామి నిర్మిస్తున్న సమతామూర్తి విగ్రహం విషయంలో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘సోషల్ మీడియా కాదు అది… క్షుద్ర విద్య. దాని బండారం తీస్తం. దాంట్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు తీసి.. పొయిల పెడుతం. సమాజానికి కూడా మంచీచెడూ తెలవాలని ఇన్ని రోజులు ఉరుకున్నం. ఇప్పుడు ఉరుకోం’ అని హెచ్చరించారు. ‘చినజీయర్స్వామి హైదరాబాద్ల రామానుజులవారి విగ్రహం పెట్టిన్రు. ముందు తమిళనాడులో పెడదాం అనుకున్నరు. వీలుకాలె. ఇక్కడ మై హోం రామేశ్వర్రావు సొంత భూమి వంద ఎకరాలు ఇచ్చిండు. అక్కడ జీయర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉన్నది. హోమియోపతి కాలేజ్, ఇప్పుడు దాన్ని హోమియోపతి యూనివర్సిటీ చేస్తాండ్రు. వారి ఆశ్రమం ఉంటది. పేదలకు అన్నం పెడతరు. ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. అన్ని మఠాలు చేసినట్టు ఆయన కూడా చేస్తరు. అది హిందూధర్మంలోని వైష్ణవ సంప్రదాయానికి ప్రతీకగా ఉంటది. రామానుజాచార్యులు వెనుకట హిందూ మతం పెడ ధోరణులు పడితే.. అలా కాదని, భగవంతుడు అందరివాడని, కులాలు, మతాలు ఉండకూడదని చెప్పారు. రామానుజుల వారు రివల్యూషనరీ. దళితులు ఆలయానికి రావాలని చెప్పిన మహనీయులు.
అందుకే ఆ మూర్తికి సమతామూర్తి అని పేరుపెట్టారు. 10 ఏండ్ల నుంచి తిప్పలు పడి.. పైస పైస కూడబెట్టుకొని సమతామూర్తి విగ్రహాన్ని తయారుచేయించి కట్టిండ్రు. ఎవ్వరూ ఏకాన ఇయ్యలే. ఈ బీజేపీ వాళ్ల సంస్థల సిగ్గులేనితనం ఏమంటే.. ఉత్తర భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్నయి. ఒవైసీ అక్కడక్కడ పోటీ చేస్తున్నడు. వేరే రాష్ర్టాల్లో ఈ మధ్య పాపులర్ అయిండు. ‘ఒవైసీ కే ఘర్కే పీఛే నరేంద్ర మోదీనే బన్వాయా’ అని సోషల్ మీడియాలో రామానుజుల విగ్రహం గురించి ప్రచారం చేస్తున్నరు. ఏం చెప్పాల్నో నాకర్థంకాదు! నన్నే ఢిల్లీలో ఎంతోమంది అడిగిండ్రు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర విమానం ల్యాండ్ అవుతుంటే పెద్ద విగ్రహం కనిపిస్తుంది.. ఆ మూర్తి ఎవరు అని అడిగితే జీయర్స్వామి, ఆయన శిష్యులు కలిసి కట్టుకున్నరని చెప్పిన. ఏ క్యాహై సాబ్.. మోదీ బన్వాయా అని చెప్తున్నరు అని అన్నరు. నిజానికి మోదీకి ఇక్కడ ఇంత పెద్ద సమతామూర్తి విగ్రహం నిర్మించిన విషయం తెల్వనే తెలియదు.. ఇంతకన్నా బేషరం ముచ్చట ఉంటదా?’ అని మండిపడ్డారు.
మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలని..
‘బీజేపీ ఈ దేశానికి పట్టిన దరిద్రం. మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని ముద్దాడుతరు. మనుషులనే వాళ్లకు కొద్దిగా పౌరుషం ఉంటది. వందలసార్లు అసెంబ్లీల చెప్పిన అయినా అదే మాట.. బీజేపీకి రామానుజాచార్యుల విగ్రహానికి ఎలాంటి సంబంధంలేదు. నేను చెప్తున్న కదా! ఎన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్.. కేసీఆర్ కిట్ అని ఇస్తం. ఎవడన్న చెప్పుకొంటారా.. ఇది మా (బీజేపీ) పథకమని? మేం అసెంబ్లీలో.. బయట ఎన్నిసార్లు చెప్పినా కేసీఆర్ కిట్లో మావి ఆరువేలున్నాయి అంటరు. ఉన్నయా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు పోతే లెక్కలు దొరకయా ఎక్కడైనా 24 గంటల కరెంటు ఇస్తున్నారా…? దేశంలో 24 గంటల అద్భుతమైన, నాణ్యమైన కరెంటు ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉన్నదా తెలంగాణ తప్ప. ఏ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయామో అక్కడ ఇస్తున్నారా 24 గంటల కరెంటు? అదే ఆంధ్రవాళ్లు మనల్ని ఎకిలి చేశారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ల పర్ క్యాపిటా ఇన్కం ఎంత, మన పర్ క్యాపిటా ఇన్కం ఎంత? కనపడుతలేదా, వాస్తవాలు ఈ విధంగా ఉంటే, క్షుద్ర రాజకీయం, క్షుద్ర విద్య పెట్టి సొల్లు పురాణం, సోషల్ మీడియా పేరిట కుమ్మరిస్తా ఉంటే మౌనంగా ఉండాల్నా?’ అని కేసీఆర్ ప్రశ్నించారు.