పాలకుర్తి: బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును పాలకుర్తి నియోజకవర్గంలో గెలిపిస్తే రైతుబంధు రూ.16 వేలు అయితదని, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఉన్నది గూడా పోతదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకుర్తిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన ప్రజాసంక్షేమ పథకాలన్నీ అక్కర్లేదని, తాము అధికారంలోకి రాగానే వాటిని తీసేస్తమని కాంగ్రెసోళ్లు చెబుతున్నరని, కాబట్టి ప్రజలు బాగా ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ కోరారు.
‘మేం రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నం. రైతుబంధు ఇస్తున్నం. రైతుబీమా ఇస్తున్నం. కాంగ్రెస్ నాయకులేమో నోటికొచ్చింది మాట్లాడుతున్నరు. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి కేసీఆర్కు ఏం పనిలేదు, ప్రజల సొమ్మును రైతుబంధు పేరుతోటి దుబారా చేస్తున్నడు అంటున్నడు. రైతుబంధు నిజంగా దుబారానేనా..? కాదు గదా..? రైతుబంధు ఉండాల్నంటే మరె ఏం జెయ్యాలె..? పాలకుర్తిల ఎర్రబెల్లి దయాకర్రావును గెలిపించాలి. ఇక్కడ దయాకర్రావు గెలిస్తే రైతుబంధు రూ.16 వేలు అయితది. కాంగ్రెస్ గెలిస్తే ఉన్నది గూడా మాయమైతది’ అని సీఎం అన్నారు.
10 హెచ్పీ మోటార్లు వీని అయ్యకొంటడా..?
‘పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కేసీఆర్కు ఏం పనిలేదు. 24 గంటల కరెంటు ఇచ్చి వృథా చేస్తున్నడు. మూడు గంటల కరెంటు చాలు అంటున్నడు. రైతులు 10 హెచ్పీ మోటర్ పెట్టుకుంటే చాలు గంటకు ఎకరం పారుతది అంటున్నడు. మూడు గంటలు ఇస్తే మూడెకరాలు పారుతది అని చెప్తున్నడు. మరె రైతుల దగ్గర 10 హెచ్పీ మోటార్లు ఉంటయా..? ఉండేది 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటార్లు. రాష్ట్రంల మొత్తం 33 లక్షల మోటార్లు ఉన్నయ్. మరె 33 లక్షల 10 హెచ్పీ మోటార్లు ఎవడు కొనాలె..? వీని అయ్య కొంటడా..? 10 హెచ్పీ మోటార్లు గుంజుడు వెడితే బోరు పొక్కలల్ల నీళ్లుంటయా..? అందుకే ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగమై ఓట్లేయొద్దు. మంది మాటలు పట్టుకుని మార్మానం బోతే మళ్లొచ్చేసరికి ఇళ్లు గాల్తది. మేం ఆరు చందమామలు తెస్తం, మేం ఏడు సూర్యుళ్లను తెస్తం అని తియ్యమాటలు చెప్పేటోళ్లను నమ్మి ఓటెయ్యొద్దు’ అని సీఎం సూచించారు.