CM KCR | దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను ఇబ్బందులు పెట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. రాష్ర్టాలపై ఆర్థిక పరిమితులు విధిస్తూ, రకరకాల దాడులు చేస్తూ వేధిస్తూ దుర్మార్గాలకు ఒడిగడుతున్నది. బీజేపీ దుర్మార్గాలను దేశం మొత్తం చూస్తున్నది.
కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను వెనక్కి తీసుకోవాలి. ఇందిరాగాంధీ అవలంబించిన ఎమర్జెన్సీ దారిలోనే బీజేపీ వెళ్తున్నది. ఇలా చేస్తే కాంగ్రెస్కు, బీజేపీకి తేడా ఏం ఉంటది? కేంద్రం తనకు తానుగా ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవాలి. ఆర్డినెన్స్ విషయంలో మేం కేజ్రీవాల్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. ఆర్డినెన్స్ను పార్లమెంటులో ఓడించడానికి శక్తినంతా ఉపయోగిస్తాం. కర్ణాటకలో ప్రజలు చిత్తుగా ఓడించినా బీజేపీకి బుద్ధి రాలేదు. గతంలో వ్యవసాయ నల్ల చట్టాలను ఉపసంహరించుకొన్నట్టుగానే ఈ ఆర్డినెన్స్ను వెనక్కు తీసుకోవాలి.
-ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలనలో దేశం ఎమర్జెన్సీ దిశగా వెళ్తున్నదని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆందోళన వ్యక్తంచేశారు. మోదీ సర్కారు పనిగట్టుకొని సకల రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నదని మండిపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్ ద్వారా ఢిల్లీ ప్రజలను మోదీ సర్కారు అవమానించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్డినెన్స్ను వెంటనే ఉపసంహరించుకోకుంటే పార్లమెంట్లో దా నిని అడ్డుకొని తీరుతామని స్పష్టంచేశారు.
నాడు అలహాదాబాద్ కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి ప్రజాస్వామ్యా న్ని అవమానిస్తే, ఇప్పుడు మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చి అదే పని చేసిందని ధ్వజమెత్తారు. నాడు నేడు ఒకే రకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. శనివారం ప్రగతి భవన్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్సింగ్ మా న్తో కలిసి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కేం ద్ర ప్రభుత్వ అరాచకాలు, ఆగడాలు పరాకాష్టకు చేరుకొన్నాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పు తిప్పలు పెడుతూ, పనిచేయకుండా అడ్డుకొంటున్నదని మండిపడ్డారు.
మితిమీరుతున్న దుర్మార్గాలు
దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను ఇబ్బందులు పెట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభు త్వం పనిచేస్తున్నదని సీఎం కేసీఆర్ విమర్శించారు. రాష్ర్టాలపై ఆర్థిక పరిమితులు విధిస్తూ, రకరకాల దాడులు చేస్తూ వేధిస్తూ దుర్మార్గాలకు ఒడిగడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ దుర్మార్గాలను దేశం మొత్తం చూస్తున్నదని అన్నారు. ‘ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ మూడుసార్లు రెండు జాతీయ పార్టీలను మట్టికరిపించి అద్భుతమైన మెజార్టీతో గెలిచారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన ఆధిక్యంతోని గెలిచినా ఆ పార్టీకి మేయర్ స్థానం దక్కకుండా కేంద్ర ప్రభుత్వం అనేక కుట్రలు, కుతంత్రాలు చేసింది.
చివరికి సుప్రీంకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. గెలిచిన ప్రభుత్వాన్ని పని చేయనియ్యకపోవడమే అరాచకం. పైగా ఆర్డినెన్స్ తీసుకురావడం నియంతృత్వ విధానమే. సుప్రీంకోర్టు తీర్పుకే అతీగతీ లేకపోతే పరిస్థితి ఏంటి? ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం కిందనే అధికారులంతా పనిచేయాలి. వాళ్ల నియంత్రణ, బదిలీలు, మంచిచెడ్డ అన్నీ కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి. లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లో కాదు అని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది’ అని కేసీఆర్ వివరించారు.
దేశంలో ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ రోజులను మోదీ పాలన గుర్తుకు తెస్తున్నద ని కేసీఆర్ అన్నారు. ‘ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు, మోదీ గొంతు చించుకొని మాట్లాడుతా రు. నాటి ఎమర్జెన్సీ పరిస్థితులే నేడు ఉన్నాయి. మహా పవర్ఫుల్గా ఉన్న ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని, పా ర్టీని జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో ప్రజలు చిత్తుగా ఓడించారు. ప్రజల ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేయక జనతా పార్టీ తప్పు చేస్తే అదే ప్రజలు మళ్లీ ఇందిరాగాంధీని గెలిపించారు. ఇండియా రియాక్ట్స్’ అని కేసీఆర్ చెప్పారు.
ఆర్డినెన్స్ను వెనక్కి తీసుకోవాల్సిందే
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను వెనక్కి తీసుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ‘ఇందిరాగాంధీ అవలంబించిన ఎమర్జెన్సీ దారిలోనే బీజేపీ వెళ్తున్నది. ఇలా చేస్తే కాంగ్రెస్కు, మీకు తేడా ఏం ఉంటది. కేంద్ర ప్రభుత్వం తనకు తానుగా ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవాలి. ఆర్డినెన్స్ విషయంలో మేం అరవింద్ కేజ్రీవాల్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. ఆర్డినెన్స్ను పార్లమెంటులో ఓడించడానికి శక్తినంతా ఉపయోగిస్తాం’ అని హెచ్చరించారు.
ఢిల్లీలో అనేక సంక్షేమ కార్యక్రమాలు
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేసిందని, వాటిని సీఎం కేజ్రీవాల్ తనకు స్వయంగా చూపించారని సీఎం కేసీఆర్ తెలిపారు. మోహల్లా క్లినిక్లు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, తాగునీటి విధానం, కొన్ని వర్గాలకు విద్యుత్తు రాయితీలు, పేదలకు చేయూత వంటి మంచి కార్యక్రమాలు కేజ్రీవాల్ ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. ప్రజలకు మంచి చేస్తున్నది కాబట్టే ఆప్ను ప్రజలు వరుసగా మూడుసార్లు గెలిపించారని అన్నారు.
ఇలాంటి పాపులర్ ప్రభుత్వాన్ని ఇబ్బందులపాలు చేయడం మంచిది కాదని కేంద్రానికి హితవు పలికారు. ‘ఢిల్లీ ప్రభుత్వం ఎవరో నామినేట్ చేస్తే రాలేదు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం అది. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ఢిల్లీ ప్రజలను అవమానించేలా ఉన్నది. ఇది వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు. ఢిల్లీ ప్రజలకు సంబంధించిన విషయం. రాబోయే రోజుల్లో ఢిల్లీ ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు’ అని హెచ్చరించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడిం చి వాతపెట్టినా బీజేపీకి బుద్ధి రాలేదని సీఎం కేసీఆర్ అన్నారు. గతంలో వ్యవసాయ నల్ల చట్టాలను ఉపసంహరించుకొన్నట్టుగానే ఢిల్లీ అధికారాలపై తెచ్చిన ఆర్డినెన్స్ను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రశ్న. భారత ప్రజాస్వామ్యానికి సవాల్ లాంటిది. ఇంతపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ఆర్డినెన్స్లు సరికాదు. వీటిని అస్సలు సహించం’ అని స్పష్టం చేశారు.
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
బీజేపీ పాలనతో దేశం అధోగతిపాలైందని సీఎం కేసీఆర్ విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలకు కేంద్రం తిలోదకాలిస్తున్నదని ఆరోపించారు. ‘అసలీ దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ గవర్నర్ల వ్యవస్థ ఏంటి? ప్రజాస్వామ్య ప్రభుత్వాలపై వాళ్ల పెత్తనమేంటి? గవర్నర్ పదవి అలంకారప్రాయం మాత్రమే. మార్చి 31వ తేదీలోపు అసెంబ్లీ సమావేశాలు పెట్టి బడ్జెట్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నరే సూచించాలి. కానీ, బడ్జెట్ పెడుతుంటే అడ్డుపడటమేంటి? ప్రజలెన్నుకొన్న ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే సుప్రీంకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సి రావటం దుర్మార్గం. కేంద్రంలో ఇంతటి దిక్కుమాలిన ప్రభుత్వాన్ని ఎప్పుడైనా చూశామా? దేశంలో ప్రస్తుతం దుర్మార్గం రాజ్యమేలుతున్నది.
ప్రజాస్వామ్యం పరిణతి చెందుతున్న కొద్దీ మెచ్యూరిటీ లెవల్స్ పెరగాలి. కానీ ఇవాళ పరిస్థితి రివర్స్లో ఉన్నది. దేశంలో ఆటవిక, పాశవిక పాలన సాగుతున్నది. దీనిని ప్రజలు ఎక్కువకాలం సహించరు. నిన్నకాక మొన్ననే కర్ణాటక ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారు. అక్కడ మోదీసహా బీజేపీ పరివారమంతా వంగివంగి కోతి దండాలు పెట్టినా ప్రజలు నేలకేసి కొట్టారు. ఈ తీర్పు చూసైనా కేంద్రానికి బుద్ధి రావాలి. అంతేతప్ప ఒకవైపు ప్రజలు తిరస్కరిస్తుంటే, మరోవైపు ఆగడాలు మరింత పెంచుతామంటే కుదరదు. కర్ణాటక ఫలితాలను చూ సికూడా ఢిల్లీలో ఆర్డినెన్స్ తీసుకురావడం బీజేపీ పతనానికి సూచన’ అని హెచ్చరించారు.
ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ మూడుసార్లు రెండు జాతీయ పార్టీలను మట్టికరిపించి అద్భుతమైన మె జార్టీతో గెలిచారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన ఆధిక్యంతో గెలిచినా ఆ పార్టీకి మేయర్ స్థానం దక్కకుండా కేంద్ర ప్రభుత్వం అనేక కుట్రలు, కుతంత్రాలు చేసింది. గెలిచిన ప్రభుత్వా న్ని పని చెయ్యనియ్యకపోవడమే అరాచకం. పైగా ఆర్డినెన్స్ తీసుకురావడం నియంతృత్వ విధానమే.
నాటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు, నరేంద్రమోదీ గొంతు చించుకొని మాట్లాడుతారు. కానీ, దేశంలో ఇప్పుడు ఎమర్జెన్సీకి ముందు నాటి పరిస్థితులే ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పులకు కూడా దిక్కులేకుండా పోయింది.
ఢిల్లీ ప్రభుత్వం ఎవరో నామినేట్ చేస్తే రాలేదు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం అది. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ ఢిల్లీ ప్రజలను అవమానించేలా ఉన్నది. రాబోయే రోజుల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్తారు.
– సీఎం కేసీఆర్