నల్లగొండ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారిగడ్డ బహిరంగ సభ వేదికగా నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను పడగొడుతున్న మోదీపై కేసీఆర్ ధ్వజమెత్తారు. ఢిల్లీ పీఠాన్ని కదిలించేంత విషయం తన దగ్గర ఉందని, రాబోయే రోజుల్లో అవన్నీ బయటపడుతాయని కేసీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఢిల్లీ నుంచి వస్తిరి. దొంగతనంగా ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసిరి. దొరికిరి. ఇప్పుడు జైల్లోనే ఉండిరి. ఎవడో ఒకడు వచ్చి తలమాసినోడో తడిబట్టలతోని ప్రమాణం చేస్తావా? ఇంకొకడు వచ్చి పొడిబట్టలతోని ప్రమాణం చేస్తావా? ఇది రాజకీయమా? దొరికిన దొంగలు జైల్లో ఉన్నరు. నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. ఎందుకంటే నేను రాజ్యాంగబద్ధమైన ముఖ్యమైన పదవిలో ఉన్నా. కేసు న్యాయస్థానాల్లో ఉంది. తేలుతది. నేను మాట్లాడితే దాన్ని ప్రభావితం చేసినా అంటారు. అందుకే ఆ విషయం నేను ఎక్కువ చెప్తలేను. కానీ ఒక్కమాట చెప్తున్నా సూచనప్రాయంగా. నిన్నమొన్న మీరు టీవీల్లో చూసింది గింతే. కానీ దొరికిన దొంగ ఇంత ఉన్నది. ఢిల్లీ పీఠమే దుమ్ము దుమ్ము రేగిపోయే పరిస్థితి ఉన్నది. రాబోయే రోజుల్లో అవన్నీ బయటపడుతాయి.
ఈ దుర్మార్గులను కూకటివేళ్లతో పీకేసి, బంగాళాఖాతంలో విసిరేస్తే తప్ప ఈ భారతదేశానికి నివృత్తి లేదు. భారతదేశానికి నిష్కృతి లేదు. ఈ మతోన్మాదులు, పెట్టుబడిదారుల తొత్తులు, ఈ పిచ్చి వ్యక్తులు, అరాచకం సృష్టించే వ్యక్తులు, ప్రజాస్వామికంగా గెలిచిన ప్రభుత్వాలను ఇష్టారాజ్యంగా కూలగొట్టే దుర్మార్గులను తన్ని తరిమేయకపోతే, సాగనంపకపోతే ఈ దేశం బాగుపడదు. దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి అని ఓటర్లకు కేసీఆర్ సూచించారు.