CM KCR | వైరా : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నోట్ల కట్టల ఆసాములకు.. కోట్ల విలువైన మీ ఓటుతో బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. వైరా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మదన్లాల్కు మద్దతుగా ప్రసంగించారు.
కొంతమంది ఇక్కడున్న అహంకారులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరు. వాళ్ల నోట్ల కట్టలు హైదరాబాద్లో దొరుకుతున్నయ్. వాళ్లు ఏం మాట్లాడుతారు.. డబ్బు అహంకారంతోని బీఆర్ఎస్ పార్టీవోని అసెంబ్లీ గడప తొక్కనీయం అంటరు. అసెంబ్లీ కడప తొక్కనీయకపోవడానికి వీడెవడు..? నాకు అర్థం కాదు. అసెంబ్లీకి ఎవర్నీ పంపాలో నిర్ణయించేది మీరు కదా..? ఆ ఓటు మీ దగ్గర ఉంది కదా..? అందుకే ఈ నోట్ల కట్టల ఆసాములకు.. కోట్ల విలువైన మీ ఓటుతోనే గుద్ది బుద్ది చెప్పాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఎంపీ నామా నాగేశ్వర్ రావు నాకు చెప్పారు. వైరా రిజర్వాయర్లో నీళ్లు ఎండిపోతున్నాయి. పంటలకు నీళ్లు అవసరం ఉన్నాయి. వెంటనే విడిపించాలని అన్నారు. ఇదే కాంగ్రెస్ రాజ్యంలో అయితే ఇచ్చేవారా..? నెత్తి కొట్టుకున్న ఇవ్వకపోదురు. మొన్న మీరు అడిగారు.. చిటికె లోపల నీళ్లు వచ్చాయి. ఫుల్గా నీళ్లతో వైరా ప్రాజెక్టును నింపేశాం. ఇది కాంగ్రెస్ రాజ్యంలో సాధ్యమయ్యేదా..? మన రాజ్యం ఉంది కాబట్టి మన ప్రజల కోసం ఏదైనా చేయాలని తండ్లాడుతున్నాం అని కేసీఆర్ తెలిపారు.
సీతారామ ప్రాజెక్టు 70 శాతం కప్లీట్ అయింది. 30 శాతం పనులు మిగిలి ఉన్నాయి. ఇంకో మాట మీరు ఆలోచించాలి. ఇంత పొడవు గోదావరి ఖమ్మం జిల్లాను ఒరుసుకుంటూ పారుతది. మరి ఒక్క ముఖ్యమంత్రన్నా.. ఒక్క మంత్రన్న.. ఇవాళ కూడా ఒక మాజీ మంత్రి బాగా నరుక్కుతున్నడు కదా..? ఈ నరికినోళ్లు గోదావరి నీళ్లు తెచ్చుకోవాలని ఎందుకు ఆలోచన చేయలేదు. వాళ్లకు కడుపునొప్పి ఉండేనా..? ఇది మన రాష్ట్రం.. మనకు కడుపునొప్పి ఉంటది కాబట్టి గోదావరి ఒరుసుకుంటూ పారే జిల్లాలో జూలూరుపాడు, కారేపల్లి, ఏన్కూరు, ఇల్లెందులో కరువు ఎందుకు ఉండాలని సీతారామ ప్రాజెక్టు కడుతున్నాం. అది కంప్లీట్ అయితే వైరాతో పాటు మరిన్ని ప్రాంతాలు 365 రోజులు నిండే ఉంటాయి. పంటలకు డోఖా ఉండదు. ఆ ప్రాజెక్టు అయిపోతే 40 వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి. చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే ఎత్తైన ప్రాంతాలకు నీళ్లు పారుతాయి. చాలా సస్యశ్యామలంగా, పాత ఖమ్మం జిల్లా వజ్రపు, బంగారపు తునకలా తయారవుతుంది. అది కేసీఆర్ కల. బ్రహ్మాండంగా మనం ముందుకు పోదాం. కచ్చితంగా మదన్లాల్ను గెలిపించండి. మీ కోరికలన్నీ నెరవేర్చే బాధ్యత నాది అని కేసీఆర్ పేర్కొన్నారు.