CM KCR | వైరా : కాంగ్రెస్ రాజ్యంలో భయంకరమైన కరువు ఉండే అని, ఇవాళ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వైరా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మదన్లాల్కు మద్దతుగా ప్రసంగించారు.
పల్లెలు, గ్రామాల పరిస్థితి కాంగ్రెస్ రాజ్యంలో ఎలా ఉండే. పట్టణాల పరిస్థితి అప్పుడు ఎట్ల ఉండే.. ఇప్పుడు ఎట్ల ఉండే.. ఎన్ని మార్పులు వచ్చినయ్.. అవన్నీ మీ కండ్ల ముందే ఉన్నాయి. అభివృద్ధి పనులు మీ గ్రామంలో మీ పట్టణంలోనే ఉన్నాయి. వైరా గ్రామపంచాయతీగా ఉండే. దీన్ని మున్సిపాలిటీ చేసుకుని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇవాళ సెంట్రల్ లైటింగ్ కానీ, డివైడర్స్ కానీ, రోడ్ల విస్తరణ కానీ అద్భుతంగా జరుగుతుంది. ఇది మీ కండ్ల ముందర్నే ఉందని తెలియజేస్తున్నా అని కేసీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ రాజ్యంలో చాలా కరువుతో అవస్థలు పడ్డాం. భయంకరమైన కరువు. జూలూరుపాడు, ఏన్కూరు, కారేపల్లి మండలాల్లో కరువు ఉండే. చాలా భయంకరమైన కరువు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పుణ్యమే. తెలంగాణ వచ్చిననాడు కరెంట్ లేదు, మంచినీళ్లు లేవు, సాగునీళ్లు సరిగా రావు, రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులు, ప్రజలు వలస పోయిన పరిస్థితి. చాలా భయంకరంగా ఉండేది. ఒకటి ఒకటి బాగు చేసుకుంటూ వచ్చాం. మీరందరూ కూడ చూస్తున్నారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఎట్ల ఉండే. ఈ పదేండ్ల పాలన ఎలా ఉందో బేరిజు వేసి గమనించి, ఓటు వేయాలని కేసీఆర్ సూచించారు.
పోడు భూముల పంపిణీ విషయానికి వస్తే 3650 కుటుంబాలకు 7140 ఎకరాల భూములకు పట్టాలు ఇచ్చాం. మునుపటి లాగా పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోలేదు. వెంటనే దానికి రైతుబంధు పెట్టినం. కరెంట్ మంజూరు చేస్తున్నాం. పోడు భూముల పంచాయితీల్లో ఉన్న కేసులన్నీ ఎత్తేసినం. అవన్నీ మీ కండ్ల ముందరనే ఉన్నాయి. మా తండాలో మా రాజ్యం ఇది గిరిజన బిడ్డల నినాదం. 50 ఏండ్ల కాంగ్రెస్లో ఏనాడూ ఖాతరు కూడా చేయలేదు. కానీ ఈరోజు 3500 లంబాడీ తండాలు, ఆదివాసీ గూడెంలు, కోయగూడెంలను జీపీలుగా మార్చాం. వైరా నియోజకవర్గంలో కూడా 45 తండాలు గ్రామపంచాయతీలుగా అయ్యాయి. వాళ్ల తండాల్లో వారే పరిపాలన చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇదంతా కథ కాదు.. జరిగిన కార్యక్రమాలు చెబుతున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.