CM KCR | బోధన్ : నాటి నుంచి నేటి దాకా తెలంగాణకు శత్రువు కాంగ్రెస్ పార్టీనే అని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. బోధన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మూడోసారి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నాం. ఈ దేశంలో ఇంకా కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సిన పరిణితి రాలేదు. ఇంకా కూడా కులం, మతం పేరిట కొట్లాటలు, పంచాయితీలు, ఝూటా వాగ్దానాలు, ఆరోపణలు, అభాండాలు.. ఒక పిచ్చిపిచ్చిగా గడబిడి జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సిన పరిణితి రాకపోవడం. ఏయే దేశాల్లో ప్రజాస్వామ్య ప్రక్రియ పరిణితి చెందిందో ఆ దేశాలు అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నాయి. మనం కూడా అలా బాగుపడాల్సిన అవసరం ఉంది అని కేసీఆర్ పేర్కొన్నారు.
ప్రతి ఎన్నికలో ప్రతి పార్టీకో మనిషి నిలబడుతారు. బీఆర్ఎస్ తరపున షకీల్ బాయ్ నిలబడ్డాడు. కాంగ్రెస్ తరపున ఒకాయన నిలబడ్డాడు. బీజేపీకి కూడా ఒకరు ఉంటారు. ఇండిపెండెంట్ ఒకరిద్దరు ఉండొచ్చు. ఈ అభ్యర్థుల గురించి ఆలోచన చేయాలి. మంచి చెడ్డవారు ఎవరు అని ఆలోచన చేయాలి. అభ్యర్థుల వెనుక ఉండే పార్టీల గురించి ఆలోచన చేయాలి. ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిస్తే అక్కడ ఆ గవర్నమెంట్ ఏర్పడతుంది. మంచి గవర్నమెంట్ రాకపోతే ఐదేండ్లు ఏం చేయలేం. లేనిపోని ఇబ్బందులు వస్తాయి. ఏ పార్టీకి అధికారం ఇస్తే ప్రజల గురించి ఆలోచించారని ఆలోచించి ఓటేయాలి. ప్రజలు గెలవనంత వరకు దేశం అనుకున్నంత ముందుకు పోదు అని కేసీఆర్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కులు, నీళ్లు, నిధుల కోసం. కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు అధికారంలో ఉంది. మరి పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో, 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో ఆలోచించాలి. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందేవరు..? తెలంగాణ మనది మనకు ఉండే. మంచి పంటలతోని, నిజాం రాజులు, కాకతీయ రాజులు కట్టించిన ప్రాజెక్టులు, చెరువులతో చాలా బాగుండే. తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఏపీలో కలిపితే ఆ చిన్న తప్పుకు 58 ఏండ్లు కొట్లాడాల్సి వచ్చింది. 1969లో 400 మందిని కాల్చేశారు. నేను ఉద్యమం మొదలుపెడితే మీరంతా కలిసివచ్చారు. బోధన్లో నెలల తరబడి నిరాహార దీక్షలు జరిగాయి అని కేసీఆర్ గుర్తు చేశారు.
దుర్మార్గమైన కాంగ్రెస్ నాటి నుంచి నేటి దాకా తెలంగాణకు శత్రువే. 2004లో పొత్తు పెట్టుకుంటామని వచ్చారు. తెలంగాణ ఇస్తారని నమ్మి పొత్తు పెట్టుకున్నాం. 2004లో గెలిస్తే 2005, 2006లో తెలంగాణ ఇవ్వలేదు. 15 ఏండ్లు ఏడిపించారు. మోసం చేసే ప్రతయ్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీని చీల్చి ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారు. ఉద్యమాన్ని మొత్తం ఆగం పట్టించి మరోసారి ద్రోహం చేసే పరిస్థితి చేశారు. 15 ఏండ్లు ఏడిపించి, వందల మందిని పొట్టను పెట్టుకుని తెలంగాణ ఇచ్చారు. పదేండ్ల నుంచి బీఆర్ఎస్ ఏం చేస్తుందో మీరు చూస్తున్నారు. నిజాం సాగర్ నిజాం రాజు కట్టిన ప్రాజెక్టు ఇది. 1934లో మొదలు పెట్టి కట్టారు. బాన్సువాడ, బోధన్, ఆర్మూర్ వరకు నీళ్లు పారి డిచ్పల్లి వరకు సస్యశ్యామలంగా ఉండే. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్ జిల్లా ఏందంటే లక్ష్మీ ఉండే జిల్లా నిజామాబాద్ అని పేరుండే. నిజంగానే లక్ష్మీ దేవి ఉండే. కానీ సమైక్య రాష్ట్రంలో మాయమైంది. నిజాంసాగర్ను ఎండబెట్టి.. మీద కట్టిన సింగూరు ప్రాజెక్టును హైదరాబాద్కు గంపగుత్తగా మంచి నీళ్ల కోసం ఇచ్చి పంటలు ఎండబెట్టారు. రైతులు బాధపడ్డారు. మీరు ప్రత్యక్షంగా అనుభవించారు. సింగూరు నుంచి నీళ్లు రావాలని నిజామాబాద్ కలెక్టరేట్లో ధర్నాలు చేసిన పరిస్థితి చూశామని కేసీఆర్ తెలిపారు.
కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నిజాంసాగర్కు పూర్వ వైభవం వచ్చింది. పాత నిజాంసాగర్ ఎట్టుండనే ఇప్పుడు సాగర్ అలా తయారైంది. నిజాం సాగర్ 365 రోజులు నిండే ఉంటది. మీ పంటలకు ఎటువండి డోఖా ఉండదు. దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుకు లింక్ చేసుకున్నాం. సింగూరు నీళ్లను హైదరాబాద్కు బంద్ చేసినం. హైదరాబాద్కు గోదావరి నుంచి నీళ్లు తెచ్చాం. కాళేశ్వరం జలాలు మల్లన్న సాగర్ జలాలు మీకు వస్తాయి. పాత నిజామాబాద్ ఎలా కళకళలాడిందో మళ్లా అట్లనే ఉంటుంది. 58 ఏండ్ల తర్వాత బీఆర్ఎస్ సాధించిన విజయం ఇది అని కేసీఆర్ తెలిపారు.