CM KCR | బోధన్ : కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి బోధన్ అభివృద్ధిని పట్టించుకోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. బోధన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఇవాళ బోధన్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి ఉన్నారు. గతంలో ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా ఉండే. నిజామాబాద్, బాన్సువాడ, బోధన్లో మొత్తం డిస్ట్రిబ్యూటరీ కాల్వలు పోయాయని అంటే పట్టించుకోలేదు. ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి సుదర్శన్ రెడ్డి ఒక్క పైసా తేలేదు. కానీ షకీల్ ఎమ్మెల్యే అయిన తర్వాత పట్టుబట్టి రూ. 72 కోట్లు మంజూరు చేసి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ బాగు చేయించాడు. ఆ పనులన్నీ మీ ముందర ఉన్నాయి. మీ కండ్ల ముందరనే జరిగాయి. ఇలా అనేక పనులు తెలంగాణ వ్యాప్తంగా జరిగాయి. కోసి వాగు మీద ఆరేడు చెక్ డ్యాంలు కట్టారు షకీల్. భూగర్భ జలాలు పెరిగాయి. చెరువులన్నీ బాగు చేసి, నదులు, వాగుల మీద చెక్ డ్యాంలు కట్టి బాగు చేసుకున్నాం అని కేసీఆర్ తెలిపారు.
బీడీ కార్మికులు ఇండియాలో 16 రాష్ట్రాల్లో ఉన్నారు. వారికి పెన్షన్ ఇవ్వాలని ఏ ప్రధాని, ముఖ్యమంత్రి ఆలోచన చేయలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నాం. పెన్షన్లను 5 వేలకు పెంచబోతున్నాం. బీడీ కార్మికులకు కూడా ఆటోమేటిక్గా 5 వేల పెన్షన్ వస్తది. నిజామాబాద్ – బోధన్ రోడ్డు అధ్వాన్నంగా ఉండే. ఇప్పుడు ఫోర్ లేన్ రోడ్డు వేయించారు షకీల్. మన కోసం కష్టపడ్డవారు, నీళ్లు తీసుకొచ్చినవారు, సంక్షేమం గురించి ఆలోచించిన వారు గెలిస్తే మరింత అభివృద్ధి జరుగుతది. హిందూ, ముస్లింలు, క్రైస్తవులు అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం. కలిసి పండుగలు జరుపుకుంటున్నాం. ఇదే పద్ధతిలో ముందుకు పోదామని కేసీఆర్ పిలుపునిచ్చారు.