తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ చర్యల వల్ల తెలంగాణలో సమృద్ధిగా పంటలు పండాయని, రైతాంగం సుఖంగా వుందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. తమ చర్యల వల్ల ఒక కోటి ఎకరాల పంట విస్తీర్ణం పెరిగిందని, అందుకే పంటలు బాగా పండాయని వివరించారు. అయితే కేంద్రంలో పూర్తి స్థాయిలో రైతు వ్యతిరేక ప్రభుత్వం వుందని, ఇది భారత రైతాంగ దురదృష్టమని విరుచుకుపడ్డారు. 13 నెలల పాటు రైతాంగం ఢిల్లీలో ధర్నాకు దిగాయని, చివరికి కేంద్రం దిగివచ్చి, ప్రధాని మోదీ ఆ చట్టాలను రద్దు చేశారని గుర్తు చేశారు.
ఇంత దిక్కుమాలిన, దరిద్రపు గొట్టు ప్రభుత్వం కేంద్రంలో వుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం తెలంగాణ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశం తర్వాత సీఎం కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. ఈ ఘట్టాలన్నింటికీ దేశ ప్రజలే ప్రత్యక్ష సాక్ష్యులని, అదంతా ఓ చరిత్ర అన్నారు. ఉద్యమాలు చేస్తున్న సమయంలో రైతులను మోదీ ప్రభుత్వం అనేక రకాలుగా తూలనాడారని, ఉగ్రవాదులుగా అభివర్ణించారని కేసీఆర్ మండిపడ్డారు.
దేశంలోని వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్లకు అప్పగించాలని ఓ బలమైన కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తోందని, దాన్ని దృష్టిలో పెట్టుకొనే వ్యవసాయ రంగాన్ని కేంద్రం కుదేలు చేస్తోందని కేసీఆర్ దుయ్యబట్టారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేస్తామని బీజేపీ ఎన్నికల హామీలో పెట్టారని, అయినా దానిని అమలు చేయరని ఎద్దేవా చేశారు. వీటన్నింటితో పాటు ఎరువుల ధరలు కూడా పెంచారని మండిపడ్డారు. తాజా పార్లమెంట్ సమావేశాల్లో తమకు అవసరమైన బిల్లులను పాస్ చేయించుకున్నారే తప్పించి, రైతులకు అవసరమైన వాటిని మాత్రం ముట్టుకోలేదని మండిపడ్డారు.