హైదరాబాద్ : ప్రజా సమస్యలను పక్కనపెట్టి.. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మతవిద్వేషాలను రెచ్చగొట్టడమే బీజేపీ పని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రాల సమస్యలను గాలికి వదిలేసి, రైతులను పట్టించుకోకుండా బీజేపీ పాలన కొనసాగిస్తోందని నిప్పులు చెరిగారు. ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ చేపట్టిన ధర్నాలో కేసీఆర్ ప్రసంగించారు.
రాష్ట్రంలో దళితుల వర్గీకరణపై మాట్లాడరు. తెలంగాణలో గిరిజనుల శాతం పెరిగింది. వారికి రిజర్వేషన్ ఇవ్వమని అడిగితే దిక్కు లేదు. అనేక సమస్యలు పెండింగ్లో పెట్టారు. బీసీ కుల గణన చేయాలని అసెంబ్లీ తీర్మానం చేస్తే సమాధానం లేదు. అనేక ప్రజా సమస్యలు పక్కన పెట్టి, ఎలక్షన్ వచ్చినప్పుడల్లా డ్రామాలాడుతూ.. మత విద్వేషాలు రెచ్చగొట్టి, సెంటిమెంట్ క్యాచ్ చేసుకుని మీరు రాజకీయం నడుపుతున్నారు. కాలం చెల్లిపోయింది. అందరూ గమనిస్తున్నారు. అందరికీ అర్థమైపోయింది. మీ సర్జికల్ స్ట్రైక్లు, మీరు సరిహద్దుల్లో ఆడే నాటకాలు, మీరు చేసే మోసాలు మొత్తం బట్టబయలై బయటకు వచ్చేశాయి.
ఈ దేశంలో వాటర్ లేదా? ఈ దేశానికి ప్రకృతి ఇచ్చిన సంపద.. 60 వేల టీఎంసీల నీరు ఉంది. 30 వేల టీఎంసీల నీరు మాత్రమే వాడారు. మిగతా నీరు సముద్రంలో కలుస్తోంది. దేశానికి, రైతులకు నీళ్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. ప్రతి ఎకరానికి నీళ్లిచ్చే మేధావి తనం లేదు. కానీ ఎలక్షన్ వస్తే భైంసా చూపెట్టాలి. ఎలక్షన్ వస్తే హిందూ ముస్లిం కొట్లాట పెట్టాలి. ఎలక్షన్ వస్తే పాకిస్తాన్ పేరు తీసుకొని సెంటిమెంట్ రెచ్చగొట్టాలి. ఇదేనా రాజకీయం. దీని కోసమేనా మిమ్మల్ని ప్రజలను ఎన్నుకున్నది. మీరు దేశానికి సమాధానం చెప్పాలి అని కేసీఆర్ డిమాండ్ చేశారు.