CM KCR | హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం ఆగడాలు, అరాచకాలు మితిమీరిపోతున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. ప్రగతి భవన్లో ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
దేశంలో కేంద్ర ప్రభుత్వం అరాచకాలు, ఆగడాలు.. మితిమీరిపోయాయి. కారణం ఏంటంటే.. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెడుతూ, పని చేయనీయడం లేదు అని కేసీఆర్ పేర్కొన్నార. చాలా రాష్ట్రాల్లో చాలా సందర్భాల్లో నాన్ బీజేపీ ప్రభుత్వాల వెంబడి పడుతున్నాయి. రకరకాల దాడులు చేస్తూ బెదిరిస్తున్నారు. అనేక దుర్మార్గాలకు పాల్పడుతోంది కేంద్రం. ఇటీవలి కాలంలో ఢిల్లీలో రెండు వింత సంఘటనలు చూశారు. ఆప్ చాలా పాపులర్ పార్టీ. ఇది దేశానికి, ప్రపంచానికి తెలుసు. కేజ్రీవాల్ నాయకత్వంలో సామాజిక ఉద్యమం ద్వారా వచ్చిన పార్టీ. ఒక్కసారి, రెండు సార్లు కాదు.. మూడు సార్లు అద్భుతమైన విజయం సాధించింది. ఈ మధ్యకాంలో వింత సంఘటన చూశాం. ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. స్పస్టమైన ఆధిక్యంతో ఆప్ విజయం సాధించింది. కానీ బీజేపీ ఎన్నో రకాలుగా, కుయుక్తులు చేసినా ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు. మేయర్ను ప్రమాణస్వీకారం చేసేందుకు ముప్పుతిప్పలు పెట్టారు. సుప్రీంకోర్టు ఆర్డర్ తర్వాత ప్రమాణం చేయాల్సి వచ్చింది. కేజ్రీవాల్ మూడుసార్లు కూడా రెండు జాతీయ పార్టీలను మట్టికరిపించి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.
ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ను తెచ్చి ఊపిరాడకుండా, అనేక దుర్మార్గ చర్యలకు పాల్పడుతుంది. కేజ్రీవాల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఐదు సభ్యులతో కూడిన బెంచ్ స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కిందనే అధికారులందరూ పని చేయాల్సి ఉంటుంది. కచ్చితంగా ప్రభుత్వం చెప్పినట్లు వినాలి. గవర్నర్ల చేతుల్లో ఉండరాదు అని కోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను కూడా కాలరాశారు. సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ ఇవాళ భయంకరంగా ఆర్డినెన్స్ను తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఎమర్జెన్సీని వ్యతిరేకించే బీజేపీ నేతలు కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇందిరా గాంధీ అమలు చేసిన ఎమర్జెన్సీ దిశగా కేంద్రంలోని బీజేపీ వెళ్తోంది. బీజేపీకి ఢిల్లీ ప్రజలు మరోసారి తగిన బుద్ధి చెబుతారు. కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా ఢిల్లీ ప్రజలను అవమానిస్తోందని కేసీఆర్ మండిపడ్డారు.