హైదరాబాద్ : జాతీయ సగటుకు ఆదాయాన్ని సమకూర్చే నాలుగు ఉత్తమ రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని ఆర్బీఐ కితాబిచ్చింది. ఇది తెలంగాణ సాధిస్తున్న ప్రగతి అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని చాలాసార్లు చెప్పాం. అందుకే ఇవాళ ఇండియాలో నంబర్ వన్ శాలరీ మన ఉద్యోగులకు ఇస్తున్నాం. మన దగ్గర నుంచి కేంద్రానికి పోయే నిధులు ఎక్కువ. అక్కడ్నుంచి చాలా తక్కువ నిధులు వస్తాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా రావాల్సిందే అని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చేది కేవలం సీఎస్ఎస్ మాత్రమే అని తెలిపారు. శాసనసభలో పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తోంది. రాష్ట్రాల హక్కులపై కేంద్రంతో పోరాడుతాం. ఇటీవలే తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా లేఖ రాశారు. ఒక ప్రాంతీయ పార్టీ నేతగా కేంద్రం తీరును వ్యతిరేకిస్తున్నాను. గ్రామపంచాయతీల అభివృద్ధికి అక్టోబర్ వరకు ప్రతి నెల రూ. 227 కోట్లు విడుదల చేశాం. గ్రామపంచాయతీలకే కాకుండా అర్బన్ లోకల్ బాడీస్ కు రూ. 112 కోట్లు విడుదల చేస్తున్నాం. దీంట్లో స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ ఉంటది. ఫైనాన్స్ కమిషన్ కేటాయింపులు కూడా ఉంటాయి.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం పదేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ. 12,173 కోట్లు మాత్రమే. కానీ ఈ ఏడేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 58,303 కోట్లు అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లో మంచి వికాసం జరుగుతుంది. ప్రగతి కనబడుతోంది. ఇప్పుడిప్పుడే మంచి అభివృద్ధిలో పయనిస్తున్నాం. అన్ని శాఖలు అద్భుతంగా పని చేస్తున్నాయి. చక్కటి ఫలితాలు వస్తున్నాయి. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలను పక్కాగా అమలు చేస్తున్నాం అని సీఎం తెలిపారు.