కామారెడ్డి: బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు గజ్వేల్లో నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన సీఎం.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కామారెడ్డికి చేరుకున్నారు. అనంతరం పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి రోడ్డు మార్గంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, సోమ భరత్.. సీఎం వెంట ఆర్వో కార్యాలయంలోకి వెళ్లారు.
సీఎం కేసీఆర్ గురువారం ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గజ్వేల్కు వెళ్లారు. అక్కడ నామినేషన్ దాఖలు అనంతరం గజ్వేల్ నుంచి హెలికాప్టర్లో కామారెడ్డికి చేరుకుని నామినేషన్ వేశారు. మరికాసేపట్లో సీఎం కామారెడ్డిలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. నియోజకవర్గ ఓటర్లను ఉద్దేశించి ఈ సమావేశంలో ప్రసంగించనున్నారు.
కాగా, సీఎం కేసీఆర్ శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గజ్వేల్, కామారెడ్డికి సంబంధించిన రెండు సెట్ల నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి, స్వామి వారి సన్నిధిలో పెట్టి పూజలు నిర్వహించారు. ప్రతిసారి నామినేషన్ వేసే ముందు సీఎం కేసీఆర్ కోనాయిపల్లి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.
కాగా, కోనాయిపల్లి వెంకన్నకు పూజలు చేసిన ప్రతిసారి సీఎం కేసీఆర్ను విజయం వరించింది. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లో జరిగిన ఎన్నికల సమయంలో ఈ ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు చేసి, నామినేషన్ వేశారు. అన్ని సందర్భాల్లోనూ విజయం సాధించారు.