సీఎం కేసీఆర్కు రాఖీ కట్టిన సోదరీమణులు.. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలుహైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్లో శుక్రవారం రాఖీ పండుగ ఘనంగా జరిగింది. సీఎం కేసీఆర్ సోదరీమణుల రాకతో నివాసంలో సందడి నెలకొన్నది. ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ సాదరంగా, సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించారు.
సీఎం కేసీఆర్ అకలు లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన అక్కలకు సీఎం కేసీఆర్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకొన్నారు. సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య కూడా రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. అన్న హిమాన్షుకు చెల్లె అలేఖ్య రాఖీ కట్టారు. వీరిని సీఎం కేసీఆర్, శోభమ్మ దంపతులు నిండు మనసుతో దీవించారు. వేడుకల్లో మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ తదితరులు పాల్గొన్నారు. రక్షాబంధన్ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ చిత్రపటాలు, కటౌట్లు, విగ్రహాలకు మహిళలు, చిన్నారులు రాఖీలు కట్టి అభిమానం చాటుకొన్నారు. మహిళల ఆత్మగౌరవం పెంచేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.