హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ధర్మ స్థాపనకు నిదర్శనంగా, విజయాలను అందించే విజయదశమిగా దసరా పండుగను దేశవ్యాప్తంగా జరుపుకొంటారని పేర్కొన్నారు.
దసరా రోజున శుభసూచకం గా పాలపిట్టను దర్శించి పవిత్రమైన జమ్మిచెట్టుకు పూజలు చేసే సంప్రదా యం గొప్పదని అభివర్ణించారు. జమ్మి ఆకును బంగారంలా భావించి పంచుకొంటూ, పెద్దల ఆశీర్వాదాలను అందుకొంటూ, అలయ్ బలయ్ తీసుకొంటూ, ప్రేమాభిమానాలను చాటుకోవడం దసరా ప్రత్యేకత అని తెలిపారు. అనతికాలంలోనే అభివృద్ధి సాధించి రాష్ట్రాన్ని ముందంజలో నిలిపిన తెలంగాణ పాలన.. దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. తెలంగాణ స్ఫూర్తితో దేశం ప్రగతిబాటలో నడువాలని సీఎం ఆకాంక్షించారు. విజయానికి సంకేతమైన దసరా నాడు తలపెట్టిన కార్యాలన్నీ ఫలించాలని సీఎం ప్రార్థించారు. ప్రజలందరూ సుఖ శాంతులతో వర్ధిల్లాలని సీఎం కేసీఆర్ కోరుకొన్నారు.